Tollywood News: లైట్స్- కెమెరా- యాక్షన్ ఎప్పుడు? 'సినిమా కష్టాలను' తెలంగాణ మంత్రికి వివరించిన టాలీవుడ్ పెద్దలు, చిరంజీవి ఇంట్లో ప్రత్యేక భేటీ, తలసాని ఇచ్చిన హామి ఇదే!
Tollywood supremos meet with Talasani | Photo: Twitter

Hyderabad, May 22: కోవిడ్19 వ్యాప్తి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్  కారణంగా దేశంలో ఎన్నో రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందులో సినిమా రంగం కూడా ఉంది. కరోనావైరస్ సినిమా రంగం యొక్క భవిష్యత్తునే మార్చే పరిస్థితులను తీసుకొచ్చింది. అయితే ఈ లాక్డౌన్ కారణంగా పెద్దపెద్ద స్టార్లకు, ఇతర సినీ ప్రముఖులకు కలిగే నష్టం వారిపై పెద్దగా ప్రభావం చూపకపోయినా. సినిమా రంగాన్నే నమ్ముకుని బతికే ప్రొడక్షన్ బాయ్స్, లైట్ మెన్, ఇతర సినీ కార్మికుల బ్రతుకులు లాక్డౌన్ కారణంగా చితికిపోయాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పర్చుకున్నారు. లాక్డౌన్ కారణంగా తలెత్తిన 'సినిమా కష్టాలను' మంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో పలువురు నిర్మాతలు, దర్శకులు మాట్లాడుతూ లాక్‌డౌన్ తో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అయినప్పటికీ అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే షూటింగ్ లను నిలిపివేయడం జరిగిందని తెలిపారు.

ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14 వేల మందికి కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని చెప్పారు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని సినిమా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ తదితర కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు, సినిమా థియేటర్ లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు.

భౌతిక దూరం, ఇతర కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ షూటింగ్‌లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో వివరిస్తూ అవుట్ డోర్, ఇండోర్ షూటింగ్ లకు సంబంధించిన మాక్ వీడియో ను ప్రభుత్వానికి సమర్పిస్తామని మంత్రికి వారు వివరించారు.

తలసాని ఏమన్నారంటే..

 

స్పందించిన మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ లాక్‌డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచిత్ర పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటుందని చెప్పారు. దేశంలోనే హైదరాబాద్ నగరం చిత్రరంగానికి హబ్ గా నిలిచిందని అన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చేసుకునేందుకు అనుమతించే విధంగా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు.  గాడ్సేపై ట్వీట్ చేసి దుమారం రేపిన నాగబాబు, గాంధీ గురించి ట్వీట్ చేసి ఆవేదన వ్యక్తం చేసిన విజయశాంతి

తప్పనిసరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్ లను ధరించాలని, శానిటైజేషన్ ఉపయోగించాలని, భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాక్ షూటింగ్ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

అయితే షూటింగ్ ల నిర్వహణ మరియు థియేటర్ లను తిరిగి తెరిచే అంశాలను ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామి ఇచ్చారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్, C.కళ్యాణ్, దిల్ రాజు, శ్యాం ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, దర్శకులు VV,వినాయక్, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, N.శంకర్, FDC మాజీ చైర్మన్ రాం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.