New Academic Year: ఆగస్టు 1 నుంచి కొత్త విద్యా సంవత్సరం, వర్సిటీలు వారానికి ఆరు రోజులు పని చేయాలి, యూజీసీకి పలు సిఫార్సులు చేసిన నిపుణుల కమిటీ
University Grants Commission (Photo Credits: PTI)

New Delhi, April 29: కరోనావైరస్ (Coronavirus) నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ (Lockdown) కారణంగా ప్రస్తుత 2019–20లో విద్యా సంస్థలన్నీ స్తంభించిపోయాయి. పరీక్షలు, ఇతరత్రా కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి. ఆగిపోయిన వాటిని నిర్వహించడంతో పాటు వచ్చే 2020–21 విద్యా సంవత్సరం పైనా దాని ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరపు పరీక్షల నిర్వహణను ముగించడంతో పాటు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ, పరీక్షలపై నిపుణుల కమిటీ యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్‌ (UGC)కు పలు సిపార్సులు చేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు, జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభం, ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.4వేల కోట్లకుపైగా విడుదల

వచ్చే విద్యా సంవత్సరాన్ని (New Academic Year) 2020 ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని, అలాగే, సెమిస్టర్ల వారీగా పరీక్షల తేదీలను కూడా కమిటీ (University Grants Commission expert committee) వివరించింది. అంతేకాదు వర్సిటీలు వారానికి 6 రోజులు పనిదినాలుగా పెట్టుకోవాలని తెలిపింది. ఇప్పటికే ఆగిపోయిన ప్రాజెక్టు వర్కు డిజర్టేషన్, ఇంటర్న్‌షిప్, ఈ ల్యాబ్స్, సిలబస్‌ పూర్తి, ఇంటర్నల్‌ అసెస్‌మెంటు, అసైన్‌మెంట్లు, ప్లేస్‌మెంటు డ్రైవ్‌ కార్యక్రమాలను మే 16 నుంచి మే 31లోపు పూర్తిచేయాలని నిపుణుల కమిటీ సూచించింది. మీరు ఇంట్లో బందీ అయిపోయారా, అయితే మీ కోసమే కొన్ని లెర్నింగ్ యాప్స్, ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్ మీద ఓ లుక్కేయండి

నిపుణుల కమిటీ సూచనలు

1. ఈ ఏడాది సంవత్సరాంత పరీక్షలు జూలై 1–15 వరకు నిర్వహించాలి. పరీక్షల నిర్వహణలో వర్సిటీలు, కాలేజీలు ప్రత్యామ్నాయ, సులభ మార్గాలను ఎంచుకోవాలి. యూజీసీ నిర్దేశించిన సీబీసీఎస్‌ విధానంలో తక్కువ సమయంలో పూర్తిచేసేలా చూడాలి.

2. ఓఎమ్మార్‌/ఎంసీక్యూ ఆధారిత పరీక్షలు, ఓపెన్‌ బుక్‌ ఎగ్జామినేషన్, ఓపెన్‌ చాయిస్‌ అసైన్‌మెంటు వంటివి అనుసరించాలి. భౌతిక దూరాన్ని పాటిస్తూ బహుళ షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల సమయాన్ని 3 గంటల నుంచి 2 గంటలకు కుదించాలి. అలాగే మిడ్‌ సెమిస్టర్‌ తదితర ఇంటర్నల్‌ ఇవాల్యుయేషన్‌ మార్కులకు 50 శాతం, తక్కిన 50 శాతం మార్కులను అంతకుముందు విద్యార్థి పనితీరుకు వచ్చిన మార్కుల ఆధారంగా తీసుకోవాలి. యూజీ, పీజీ కోర్సుల సెమిస్టర్‌/ఇయర్లీ పరీక్షలను ఆయా వర్సిటీలు లాక్‌డౌన్‌ తొలగింపు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవాలి.

3. ల్యాబ్‌ ప్రాజెక్టులకు బదులు సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ప్రాజెక్టులను ఇవ్వాలి. స్కైప్‌ తదితర విధానాల్లో వైవా నిర్వహించాలి. రాష్ట్ర, జాతీయస్థాయి కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలను ఆయా వర్సిటీలు పరిస్థితులను అనుసరించి నిర్వహించుకోవచ్చు. యూనివర్సిటీలు పీజీ, యూజీ కోర్సుల్లోకి 2020–21 ప్రవేశాలను ఆగస్టు 31లోపు నిర్వహించుకోవచ్చు. అలాగే సెప్టెంబర్‌ 30 నాటికి ధ్రువపత్రాల పరిశీలన జరగాలి.

ప్రైవేటు స్కూళ్ల వివరాలకు ప్రత్యేక పోర్టల్‌

ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పాఠశాల విద్యాశాఖ సేకరిస్తోంది. ఇందుకు సంబంధించి ఇటీవలే ప్రత్యేకంగా ఒక పోర్టల్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇందులో ఆయా స్కూళ్లు తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారం మొత్తాన్ని అందించాలి.

ఏపీలో ప్రైవేట్ స్కూళ్లకు నియమ నిబంధనలు 

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. పాఠశాల, ఉన్నత విద్యారంగాలు రెండింటినీ సమూలంగా ప్రక్షాళన చేసి ప్రమాణాలు పెంచే దిశగా అనేక చర్యలు చేపట్టింది.ఇందులో భాగంగా ఇప్పటికే ఈ రెండింటికీ హైకోర్టు మాజీ న్యాయమూర్తులు చైర్మన్లుగా చట్టబద్ధమైన కమిషన్లను ఏర్పాటుచేసింది. దీంతో పాటుగా పాఠశాల విద్యాశాఖ ఆయా స్కూళ్లలోని పరిస్థితులపై వాస్తవిక, సమగ్ర సమాచారాన్ని సేకరించాలని తలపెట్టింది.

ప్రైవేటు స్కూళ్ల టీచర్లకు సంబంధించి ప్రత్యేకంగా ‘ప్రైవేటు టీచర్స్‌ పర్టిక్యులర్స్‌’ పేరుతో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన వెబ్‌సైట్లో కొన్ని వివరాలు అప్‌లోడ్‌ చేయిస్తోంది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల వినతి మేరకు మే 5వ తేదీ గడువు పొడిగించి ఆ తేదీలోగా అందరూ తమ సంస్థల్లో పనిచేస్తున్న వారి సమాచారాన్ని పొందుపర్చాలని ఆదేశించింది. టీచర్లకు సంబంధించి అనేక అంశాలు దీనిలో ఉన్నాయి. ఇందులో ప్రైవేట్‌ స్కూళ్లు జిల్లా కోడ్, స్కూల్‌ పేరు, జిల్లా పేరు, మండలం, గ్రామం, స్కూల్‌ కేటగిరి వంటి వివరాలను అందజేయాల్సి ఉంటుంది.

అలాగే టీచర్లు అర్హతలకు సంబంధించి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ తదితరాలను పొందుపర్చాలి. ఆయా కోర్సులు పాసైన తేదీలు, వాటిని ఏ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, సంస్థల్లో చదివారో కూడా స్పష్టంగా తెలియజేయాలి. వీటితో పాటు టీచర్లు ఎక్కడ నివసిస్తున్నారన్న అంశాలను పొందుపర్చాల్సి ఉంటుంది. వీటితో పాటుగా టీచర్‌ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, జెండర్, పాన్‌కార్డు నెం, ఆధార్‌ నెం, మొబైల్‌ నెం, కమ్యూనిటీ, నెల జీతం, నెలవారీ టాక్స్, బ్యాంక్‌ అకౌంట్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ వంటివి జత చేయాలి.