Sonu Sood: కీలక ప్రకటన చేసిన సోనూసూద్, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సోనూసూద్ సోదరి మాళవిక, ఏ పార్టీలో చేరుతారన్నది సస్పెన్స్

Chandigarh November 14: రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు నటుడు సోనూసూద్. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి బరిలోకి దిగనున్నారనేది మాత్రం స్పష్టం చేయలేదు.

ప్రజలకు సేవ చేయాలన్న తన సోదరి మాళవిక నిబద్దతకు తాను సపోర్ట్ చేస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించారు. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తామని సోనూ సూద్ చెప్పారు. ఈమేరకు మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్‌ ప్రకటించారు.

సోనూ సూద్‌ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్‌ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌తో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్‌ కా మెంటార్స్‌’ అనే కార్యక్రమానికి సోనూసూద్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.