Assembly Byelections 2022: ఆరు రాష్ట్రాల్లో 7 అసెంబ్లీ స్థానాలకు ముగిసిన పోలింగ్, నవంబర్ 6న కౌంటింగ్, బీజేపీ-ప్రాంతీయ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ
Polls 2021 | (Photo-PTI)

New Delhi, Nov 4: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు (Assembly Byelections 2022) గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. వీటిలో చాలా స్థానాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు ప్రాంతీయ పార్టీల మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా అధికారులు అన్ని భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ఓటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు మరింత పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు, ఓటర్‌ స్లిప్‌లను పరిశీలించి ఓటర్లను పోలింగ్‌ బూత్‌లోకి అనుమతించారు.

ఓటింగ్ సరలిని చూస్తే.. మహారాష్ట్రలోని అంధేరి(తూర్పు)లో అత్యల్పంగా 31.74% పోలింగ్‌ నమోదైంది. బిహార్‌లోని మొకామాలో 53.45%, గోపాల్‌గంజ్‌లో 51.48%, హరియాణాలోని ఆదంపూర్‌లో 75.25%, యూపీలోని గోలా గోరఖ్‌నాథ్‌లో 57.35%, ఒడిశాలోని ధామ్‌నగర్‌లో 66.63% పోలింగ్‌ నమోదైంది. మునుగోడులో 91. 31 శాతం పోలింగ్ నమోదైంది. స్వల్ప ఘటనలు మినహా మొత్తం మీద పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. ఉప ఎన్నికలు జరిగిన 7 స్థానాల్లో బీజేపీకి 3, కాంగ్రెస్‌కు 2, శివసేనకు ఒకటి, ఆర్జేడీకి చెందిన ఒక సిట్టింగ్‌ సీటు ఉన్నాయి. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

పోటెత్తిన ఓటరు.. మునుగోడులో ముగిసిన పోలింగ్.. మొత్తంగా 93.13 శాతం పోలింగ్ నమోదు.. 2018లో జరిగిన ఎన్నికల్లో నమోదైన 91.31 శాతం పోలింగ్ తో పోలిస్తే ఇది రెండు శాతం ఎక్కువ..

అంధేరి(తూర్పు) నియోజకవర్గ శివసేన అభ్యర్థి రుతుజా లట్కే గెలవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.. శివసేనకు ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు ఇస్తుండటంతోపాటు బీజేపీ అభ్యర్థి బరి నుంచి వైదొలిగారు. శివసేన ఎమ్మెల్యే రమేశ్‌ లట్కే మృతి చెందడంతో ఆయన భార్య పోటీలో ఉన్నారు.

హర్యానాలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి అయిదు దశాబ్దాల కంచుకోటగా ఉన్న అదంపూర్‌లో మరోసారి పట్టుసాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఆయన మనవడు(కుల్దీప్‌ బిష్ణోయ్‌ కొడుకు) భవ్య బిష్ణోయ్‌ బీజేపీ తరపున పోటీలో నిలిచారు. గత ఆగష్టులో కుల్దీప్‌ కాం‍గ్రెస్ నుంచి బీజేపీలోకి మారడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. హిస్సార్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కేంద్ర మాజీ మంత్రి జై ప్రకాశ్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించగా.. బీజేపీ నుంచి వచ్చిన సతేందర్ సింగ్‌ను ఆప్ తమ అభ్యర్థిగా నిలిపింది.

బిహార్‌లో 'మహాఘట్‌బంధన్' ప్రభుత్వానికి ఇవి తొలి ఎన్నికలు. రాష్ట్రంలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇక తెలంగాణలో పోలింగ్ గడువు ముగిసిన తర్వాత మునుగోడు ఎన్నికల ఫలితాలపై (Results) పలు సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకే విజయం దక్కుతుందని తేల్చేశాయి.