India Vs Pakistan (PIC@ BCCI X)

New Delhi, July 11: 2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి విదితమే. అయితే పాకిస్థాన్ వేదికగా జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025 కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ టోర్నీలో భారత జట్టు మ్యాచ్‌లను దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)ని కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాల కారణంగా 2008లో జరిగిన ఆసియా కప్ తర్వాత దాయాది దేశంలో భారత జట్టు పర్యటించలేదు. భారత్ లో 2012 డిసెంబర్ నుంచి 2013 జనవరి మధ్య జరిగిన భారత్–పాక్ ద్వైపాక్షిక సిరీసే చివరిది. నాటి నుంచి ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు, ఆసియా కప్ లో మాత్రమే తలపడుతున్నాయి.  మూడో టీ-20లో టీమిండియా ఘ‌న విజ‌యం, 2-1తో సిరీస్ లో ముందంజ‌, చెల‌రేగిన శుభ‌మ‌న్ గిల్, వాషింగ్ట‌న్ సుంద‌ర్

భారత్–పాక్ మధ్య సంబంధాలు ఇంకా పునరుద్ధరణ కాకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనడంపై అనిశ్చితి కొనసాగుతోంది. భారత్ అన్ని మ్యాచ్ లు ఆడేందుకు లాహోర్ ను వేదికగా ఎంపిక చేసినట్లు ఈఎస్ పీఎన్ క్రిక్ ఇన్ఫో వెబ్ సైట్ తెలిపింది. అయితే పాక్ లో పర్యటించేందుకు భారత జట్టు సుముఖంగా లేదని బీసీసీఐ వర్గాలు ఏఎన్ఐ వార్తాసంస్థకు తెలిపాయి.

కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ టోర్నమెంట్ కోసం టీమిండియాను పాకిస్థాన్ పంపుతామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మే నెలలో చెప్పారు. ‘చాంపియన్స్ ట్రోఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే అది చేస్తాం. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా నడుచుకుంటాం’ అని ఆయన ఏఎన్ఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ అన్నారు.

గతేడాది ఆసియా కప్ లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ బీసీసీఐ ఒత్తిడి కారణంగా పాక్ హైబ్రీడ్ విధానాన్ని అనుసరించింది. భారత్–పాక్ మ్యాచ్ లను తటస్థ వేదిక అయిన శ్రీలంకలో నిర్వహించింది. 2017లో చివరిసారిగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ గెలుచుకుంది.