Child Marriage in Tamil Nadu

Chennai, Mar 7: తమిళనాడు కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 సంవత్సరాల చిన్నారిని బెంగుళూరులోని 29 సంవత్సరాల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని ఆ చిన్నారి ఏడుస్తున్నా, భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళుతున్నాడు పెళ్లి కొడుకు. విషయం తెలిసి భర్తను, భర్త తమ్ముడిని, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దారుణ ఘటన వివరాల్లోకెళితే.. తమిళనాడు కృష్ణగిరి (Krishnagiri) జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14 ఏళ్ల చిన్నారికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. తనకు ఇష్టం లేకున్నా బెంగుళూరులోని 29 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి బాల్య వివాహం (Child Marriage in Tamil Nadu) చేశారు. పెళ్లి అనంతరం అత్తగారి ఇంటికి వెళ్లనని ఆ చిన్నారి ఏడ్చింది. అయితే బాలికకు ఇరువైపులా బంధువులు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు.అయినప్పటికీ చిన్నారి పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్లడానికి నిరాకరించింది.

ఏ తల్లి అయినా కొడుకుతో ఇలాంటి వీడియో చేస్తుందా?.. వైరల్‌గా మారిన వివాదాస్పద వీడియో, నెటిజన్ల తీవ్ర ఆగ్రహం

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లి కొడుకు ఎం మాదేశ్(29) కనికరం లేకుండా బాలికను భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విషయం తెలుసుకున్న కృష్ణగిరి పోలీసులు గురువారం బాల్య వివాహం, పోక్సో చట్టం కింద తల్లిదండ్రులతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. అందులో భర్తను, భర్త తమ్ముడు, బాలిక తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

Child Marriage in Tamil Nadu

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు ఆ బాలికను మంగళవారం తనకు వివాహం గురించి సమాచారం చెప్పకుండా ఒక ఆలయానికి తీసుకెళ్లి ఎం మాదేశ్‌తో బలవంతంగా పెళ్లి చేయించారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి బుధవారం ఇంటి నుంచి తప్పించుకోని తన అమ్మమ్మ ఇంట్లో ఆశ్రయం పొందింది. కానీ మాదేశ్, అతని సోదరుడు మల్లేశ్, కుటుంబ సభ్యులతో కలిసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆ బాలిక తనపై లైంగిక దాడి జరగలేదని చెప్పినట్లు కృష్ణగిరి ఎస్పీ తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఆ బాలికకు కృష్ణగిరిలోని వన్ స్టాప్ సెంటర్‌కు తీసుకెళ్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కాగా, తమిళనాడులో 2024లో 55.6 శాతం బాల్య వివాహాలు పెరిగాయి. 2023లో 1,054 బాల్యవివాహాలు జరగ్గా, ఆ సంఖ్య 2024 నాటికి 1640 కు పెరిగింది.