Lockdown: ప్రజలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్‌కు సహకరించాలి, ప్రధాని మోదీతో ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మరింత స్పష్టత వస్తుంది: తెలంగాణ సీఎం కేసీఆర్
Telangana CM KCR | File Photo.

Hyderabad, April 27:  తెలంగాణలో లాక్‌డౌన్  (Lockdown) పకడ్బందీగా అమలవుతోందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొద్ది రోజులు ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించి, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటిస్తే పరిస్థితి మరింత మెరుగవుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు.

‘‘సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో పరిస్థితిని వివరిస్తారు. ఆ రకంగా దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎలా ఉండాలనే విషయంలో కూడా ఆయా రాష్ట్రాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాయి. తద్వారా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు హాజరయ్యారు.

హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో కరోనా వ్యాప్తి పరిస్థితిని ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలు సరిగ్గా అమలు కావడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కంటైన్మెంట్లలో అమలవుతున్న సహాయక చర్యలను ఆరా తీశారు. కంటైన్మెంట్ జోన్ లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల సరుకులు అందచేయాలని ఆదేశించారు. కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా వైరస్ సోకినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు జాతీయ సగటుకన్నా తక్కువ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని తెలిపారు.

లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.