Jaunpur, November 4: గుడ్లు తిని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విచిత్ర సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది, 50 గుడ్లు తింటానని పందెం కాసి, 41 గుడ్లు తిన్నాడు, చివరకు 42వ గుడ్డు తింటుండగా ప్రాణాలు వదిలాడు. మృతుడిని 42 ఏళ్ల సుభాష్ యాదవ్గా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే...
పోలీసుల కథనం ప్రకారం, ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని జౌన్పూర్ జిల్లాలో సుభాష్ యాదవ్ (Subhash Yadav) మరియు అతడి స్నేహితుడు కలిసి సోమవారం బిబిగంజ్ మార్కెట్ ప్రాంతానికి వచ్చారు. వారిద్దరి మధ్య గుడ్లు తినే విషయం చర్చకు వచ్చింది. తాను ఎన్నైనా పచ్చి గుడ్లను తినేయగలను అని సుభాష్ అన్నాడు. దీంతో ఇద్దరు ఒకరికి మించి ఒకరు పోటీపడి గొప్పలకుపోయారు. ఇద్దరు కలిసి రూ. 2 వేలు పందెం కాశారు. ఇద్దరిలో ఎవరైతే 50 గుడ్లు తినగలరో వారు గెలిచినట్లు. ముందుగా ఈ ఛాలెంజ్ (Egg Challenge) ను సుభాష్ అంగీకరించి అనుకున్నట్లే ఒక దుకాణం వద్ద గుడ్లు తినటం మొదలు పెట్టాడు. అలా ఒకదాని తర్వాత ఒకటి 41 గుడ్లు తినేశాడు. చివరికి 42వ గుడ్డు తింటుండగా ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సుభాష్ ను స్థానికులు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు, పరిస్థితి విషమించడంతో అక్కడ్నించి లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు పంపించారు.అక్కడ చికిత్స పొందుతూ సుభాష్ ప్రాణాలు విడిచాడు.
అతిగా తినడం వల్లనే సుభాష్ మరణించాడని డాక్టర్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు స్పందించేందుకు నిరాకరించారు.