PM Modi Rally In Jammu Kashmir: ప్రధాని మోదీ ర్యాలీ జరిగే ప్రాంతానికి సమీపంలో పేలుడు, అప్రమత్తమైన భద్రతా దళాలు, నేడు జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటన..
PM Modi Italy Tour (Photo-ANI)

జమ్మూ : ఆదివారం జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ జరిగే ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైదానంలో పేలుడు సంభవించింది. జమ్మూ జిల్లాలోని లాలియానా గ్రామంలో పేలుడు సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పేలుడు జరిగిన తీరుపై విచారణ చేపట్టారు. "ఇది ఉగ్రవాదానికి సంబంధించినదిగా అనిపించడం లేదని. వివరాలు తెలుసుకుంటూ ఉన్నాం" అని పోలీసులు తెలిపారు. "ఇది మెరుపు కారణంగా ఏర్పడిన పేలుడు అయి ఉండవచ్చు", అని ఒక సీనియర్ పోలీసు అధికారి చెప్పినట్లు PTI పేర్కొంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. అందుకోసం భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ డివిజన్‌లోని సాంబా జిల్లాలోని పల్లి పంచాయతీలో, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. జమ్మూ కాశ్మీర్‌లో రూ. 20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆదివారం ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బనిహాల్-ఖాజిగుండ్ రోడ్డు సొరంగం, ఢిల్లీ-అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్ వే, రాట్లే - క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. మోదీ పర్యటనపై నిఘా ఉంచేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)తో సహా స్థానిక పోలీసులు, పారామిలటరీ సిబ్బంది మోహరించారు.

బహిరంగ సభా వేదిక వద్ద దాదాపు 30 వేల మందికి పైగా పంచాయతీ సభ్యులతోపాటు లక్ష మందికి పైగా హాజరయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భద్రత పరంగా, శనివారం, ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు పెద్ద హోర్డింగ్‌లతో అలంకరించారు. ప్రధాని మోదీ ఈరోజు ఉదయం 11:30 గంటలకు జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు.

సాంబ జిల్లా పల్లి పంచాయతీలో ఆయన పర్యటించనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి దాదాపు రూ.20,000 కోట్ల వ్యయంతో ప‌లు అభివృద్ధి కార్యక్రమాల‌ను ప్రారంభించి, శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అమృత్ సరోవర్ కార్యక్రమాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలో మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు వేడుకలో పాల్గొంటారు ప్రధాని మోదీ. మొదటి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డుతో ప్రధాని మోదీని సత్కరించనున్నారు.