Republic Day Violence: యుద్ధభూమిగా మారిన ఢిల్లీ, 154 మంది పోలీసులకు గాయాలు, 15 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు, ఎంత మంది రైతులు గాయ‌ప‌డ్డారో ఇంకా తెలియని వైనం, హింసాత్మకంగా మారిన రైతుల కిసాన్ పరేడ్
Security tightened at Red Fort (Photo Credits: ANI)

Delhi, January 27: గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని నగరం రణరంగమైంది. రైతులు సృష్టించిన బీభ‌త్సం వ‌ల్ల సుమారు 153 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. చాలా చోట్ల ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ ధ్వంస‌మైంది. ట్రాక్ట‌ర్ల‌తో రైతులు ర్యాలీ తీసిన ఘ‌ట‌న‌లో ఢిల్లీ పోలీసులు మొత్తం 15 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. ఇందులో 5 కేసులు తూర్పు ఢిల్లీ పరిధిలో నమోదయ్యాయి. కాగా, ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో (Farmers rally) ఉద్రిక్తతతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

సోన్‌పట్‌, పాల్వాల్‌, ఝజ్జర్‌ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. సాయంత్రం 5 గంటలవరకు ఇంటర్‌నెట్‌, ఎస్‌ఎంఎస్‌‌ సర్వీసులు రద్దుచేశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున పంజాబీ, హ‌ర్యానా రైతులు.. కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ (Farmers' Tractor Rally) తీసిన విష‌యం తెలిసందే.

అయితే ప్రశాంతంగా సాగుతుందనుకున్న ర్యాలీ కాస్తా హింసాత్మకంగా (Republic Day Violence) మారింది. ట్రాక్ట‌ర్ల‌తో న‌గ‌రంలోకి దూసుకువ‌చ్చిన రైతులు భారీ హింస సృష్టించారు. ఎర్ర‌కోట‌పై ఏకంగా జెండాల‌ను పాతారు రైతులు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎంత మంది రైతులు గాయ‌ప‌డ్డారో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ 153 మంది పోలీసులు మాత్రం గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం మంది ఎర్ర‌కోట వ‌ద్దే గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశరాజధానిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

ఢిల్లీ హింసాత్మక పరిస్థితులపై హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశం, పారామిలిట‌రీ ద‌ళాల‌ను హైఅలెర్ట్‌లో ఉండాలని ఆదేశాలు, హింసాత్మకంగా మారిన రైతుల కిసాన్ పరేడ్

ఎర్రకోట వద్ద భద్రతను పటిష్టం చేశారు. ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. ఘజియాబాద్‌ మండి, జాతీయ రహదారి 9, జాతీయ రహదారి 24లను పోలీసులు మూసివేశారు. ఈ రహదారులపై ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని ప్రకటించారు. దీంతో ఢిల్లీ నుంచి ఘజియాబాద్‌ వైపు వస్తున్న ప్రయాణికులు షాహదార, కర్కారి, డీఎన్‌డీ వైపు నుంచి రావాలని వాహనదారులకు సూచించారు.

రైతుల రాళ్లదాడులు, పోలీసుల లాఠీచార్జితో నగరంలోని పలు రోడ్లు యుద్ధాన్ని తలపించాయి. ట్రాక్టర్‌ తిరగబడి ఓ రైతు మరణించాడు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ 41 రైతు సంఘాలు సింఘు, , టిక్రి సరిహద్దుల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నార. దీంతో రైతుల దీక్షా శిబిరాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. నిన్నటి ఘటన దృష్ట్యా పలు ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. కొన్నిచోట్ల మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. లాల్‌ఖిల్లా, జామామసీదు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లను మూసివేశారు. మిగిలిన స్టేషన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఢిల్లీలో ట్రాక్టర్ కింద పడి రైతు మృతి, తీవ్ర హింసాత్మకంగా మారిన ట్రాక్టర్ల ర్యాలీ, దేశ రాజధానిలో ఇంటర్నెట్, మెట్రో సేవలు బంద్

రైతుల ట్రాక్ట‌ర్ల ర్యాలీతో భారీ న‌ష్టం వాటిల్లిన‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. వంద‌ల కోట్ల‌లో ఆస్తి న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ట్రాక్ట‌ర్ల‌తో బారికేడ్ల‌ను నెట్టివేస్తూ దూసుకువ‌చ్చారు. స్టీల్‌, కాంక్రీట్ బారికేడ్ల‌ను ధ్వంసం చేశారు. దీంతో రైతుల హింస వ‌ల్ల కోట్లాది న‌ష్టం జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. ముంద‌స్తు కుదుర్చుకున్న ఒప్పందాల‌ను రైతులు ఉల్లంఘించిన‌ట్లు ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. హింస‌కు దిగిన రైతుల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు చెప్పారు. నిర్ణ‌యించిన స‌మ‌యం క‌న్నా రెండు గంట‌లు ముందే రైతులు ర్యాలీ మొద‌లుపెట్టిన‌ట్లు పోలీసులు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంఘ‌వ్య‌తిరేక శ‌క్తులు హింస‌కు దిగిన‌ట్లు సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొన్న‌ది. రైతుల ఆందోళ‌న వ‌ల్ల స్థానిక ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు మొద‌లైన‌ట్లు కొంద‌రు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఢిల్లీ నగరంలో గణతంత్ర వేడుకలు ముగిసిన తర్వాత ఉదయం 11 గంటలకు ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభం కావాలని పోలీసులు సూచించగా.. ఉదయం 8.30కే రైతులు యాత్ర మొదలుపెట్టారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకోవటంతో హింస చెలరేగింది. రైతులను అదుపుచేసేందుకు పోలీసులు అనేక చోట్ల లాఠీచార్జి చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పటంతో నగరంలో కీలకమైన మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. హింసాత్మక చర్యలను ప్రభుత్వంతోపాటు రైతు సంఘాలు కూడా తీవ్రంగా ఖండించాయి. ఈ పరిణామాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎర్రకోట వద్ద రైతుల దాడి నుంచి తప్పించుకునేందుకు పలువురు పోలీసులు అక్కడున్న లోతైన గోతిలోకి దూకేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కోసం ఫెన్సింగ్‌ పైకి ఎక్కి పోలీసులు దూకేసిన ఆ గొయ్యి 15 అడుగులకు పైగా లోతు ఉంది. ఇలా దూకేసిన పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలయ్యాయి. ఢిల్లీలో రైతుల ఆందోళనలో చోటుచేసుకున్న హింస, విధ్వంసంలో 86 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాదా పు సగం మంది ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల్లోనే గాయాపడ్డారన్నారు.

ట్రాక్టర్‌ ర్యాలీలో చెలరేగిన హింసను సంయుక్త కిసాన్‌ మోర్చా తీవ్రంగా ఖండించింది. ఇది సంఘ విద్రోహుల చర్య అని ఆరోపించింది. తమ ఉద్యమంలో సంఘ విద్రో హులు ప్రవేశించారని, హింసాకాండ వారిపనేనని ప్రకటించింది. దేశ గౌరవానికి ప్రతీక అయిన ఎర్రకోటను గణతంత్ర దినోత్సవం రోజు ముట్టడించటం ద్వారా దేశానికి తలవంపులు తెచ్చారని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ మండిపడ్డారు. హింస ఏ రకంగానూ పరిష్కారం కాదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఢిల్లీ హింసపై సుమోటోగా విచారణ జరుపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముంబై లా విద్యార్థి ఒకరు లేఖ రాశారు.