India's COVID Report: మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదా? గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,881 కేసులు నమోదు, ఒక్క మహారాష్ట్రలోనే 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదు
Coronavirus Outbreak| (Photo Credits: IANS)

New Delhi, February 18: భారత్‌లో కొవిడ్ నివారణ వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోంది.  దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94 లక్షలకు పైగా టీకా లబ్ది పొందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం నాటి గణాంకాల ప్రకారం 94,22,228 మంది హెల్త్ కేర్ - ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాలు వేయించుకున్నారు.

మరోవైపు, దేశంలో కోవిడ్ కేసులను గమనిస్తే,  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 12,881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 1,09,50,201కు చేరింది. నిన్న ఒక్కరోజే 101 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,014 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,987 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,06,56,845 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,37,342 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

India's COVID Status Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.32% ఉండగా, ప్రస్తుతం తీవ్రత కేవలం (యాక్టివ్ కేసులు) 1.25% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.43% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక ఫిబ్రవరి 17 వరకు దేశవ్యాప్తంగా 20,87,03,791 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,26,562 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మహారాష్ట్రలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో మరో  4,787 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 70 రోజులలో ఇదే అత్యధికం, అలాగే ముంబైలో గడిచిన ఒక్కరోజులో 721 కేసులు నమోదయ్యాయి.  పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.