COVID19 in India: పాజిటివ్ కేసులు తగ్గుతున్నా, మరణాలు మాత్రం ఆగడం లేదు.. భారత్‌లో కొత్తగా 2.57 లక్షల పాజిటివ్ కేసులు మరియు 4,209 కోవిడ్ మరణాలు నమోదు
COVID19 Outbreak in India | Photo: ANI

New Delhi, May 21:  భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు సుమారు 20 వేల మేర తగ్గాయి. మరోవైపు కోవిడ్ నుంచి కోలుకునే వారి సంఖ్య స్థిరంగా మెరుగుపడుతోంది. ఈ క్రమంలో దేశంలో కోవిడ్ ఆక్టివ్ కేసులు తగ్గుతూపోతున్నాయి. అయితే మరణాల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మొత్తానికైతే దేశంలో సెకండ్ వేవ్ పరిస్థితులు నియంత్రణలోకి వస్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ రేటు గణనీయంగా తగ్గుతోంది. కోవిడ్ మహమ్మారి తీవ్రంగా విజృంభించిన మహారాష్ట్రలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. ఈ సెకండ్ వేవ్ లో మహారాష్ట్రలో పాజిటివ్ రేటు గరిష్టంగా 29% శాతానికి చేరగా ఇప్పుడు అది 10.6 శాతానికి తగ్గిపోవడం ఎంతో ఊరటనిచ్చే విషయం.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,59,591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,60,31,991 చేరింది. నిన్న ఒక్కరోజే 4,209 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2,91,331కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,57,295 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,27,12,735 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 30,27,925 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 87.25% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 11.63 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.12% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

మే 20 నాటికి దేశవ్యాప్తంగా 32,44,17,870 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 20,61,683 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగున్నప్పటికీ వ్యాక్సిన్ కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 19.18 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం 19,18,10,604 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 14.91 కోట్లు ఉండగా, సెకండ్ డోస్ తీసుకున్న వారి సంఖ్య కేవలం 4.26 కోట్లు మాత్రమే ఉండటం గమనార్హం.