Coronavirus in India: దేశాన్ని క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌ ముంచెత్తబోతోంది, ముప్పును ఎదుర్కునేందుకు రెడీ కావాలి, ఉన్న‌తాధికారుల‌తో ప్రధాని మోదీ సమీక్ష, దేశంలో తాజాగా 33,376 మందికి కరోనా, 308 మంది మృతి
Coronavirus in India (Photo-PTI)

New Delhi, Sep 11: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 33,376 కొత్త కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus in India) నమోదు అయ్యాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 32,198 మంది డిశ్చార్జ్ అవగా...308 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,32,08,330కి (COVID-19 Cases in India) చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,23,74,497గా ఉంది. ప్రస్తుతం 3,91,516 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా మొత్తం 4,42,317 మంది మృతి చెందారు. 73,05,89,688 మంది టీకాలు తీసుకున్నారు.

క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు స‌ర్వ‌స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ (PM Modi) ఆదేశించారు. ఈ నెలాఖ‌రులో గానీ, వ‌చ్చే నెల‌లో గానీ దేశాన్ని థ‌ర్డ్ వేవ్ ముంచెత్తుతుంద‌న్న ఆందోళ‌న మ‌ధ్య ఆదివారం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. కేరళ, మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంపై మోదీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో రికవరీ రేట్ 97.49% ఉండటాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 72 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారిలో 50% మంది ఫస్ట్ డోస్, 18% మంది సెకండ్ డోస్ కూడా తీసుకున్నారని వివరించారు.

మళ్లీ ఇంకో కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాతో సహా పలు దేశాల్లో కరోనా C.1.2 వేరియంట్ ని కనుగొన్న శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌కు సైతం ఈ కొత్త వేరియంట్ లొంగదని నివేదికలో వెల్లడి

12 సంవత్సరాలు పైబడిన వారికి ఈ నెల 15నుంచి జైకోవ్ డీ వ్యాక్సిన్లు వేయనుండటంతో ఏర్పాట్లను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు. ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి ఆరోగ్య వ్య‌వ‌స్థ‌లు స‌ర్వ‌స‌న్నద్ధం కావాల‌న్నారు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్ ల‌భ్య‌త‌, వ్యాక్సిన్ల ఉత్ప‌త్తి, స‌ర‌ఫ‌రా, పంపిణీ వంటి విష‌యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారుల‌కు హిత‌వు చెప్పారు. దేశంలో ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ మౌలిక వ‌స‌తులు అభివృద్ధి చెందిన తీరును వివ‌రించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో బెడ్ల సామ‌ర్థ్యం, పిల్ల‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌, వ‌స‌తుల ప‌రిస్థితిని న‌రేంద్ర‌మోదీ స‌మీక్షించారు. వివిధ రాష్ట్రాల‌కు దాదాపు ల‌క్ష ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు, మూడు ల‌క్ష‌ల ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. తాజాగా వెలుగు చూస్తున్న క‌రోనా మ్యూటెంట్ల పట్ల నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అధికారుల‌ను హెచ్చ‌రించారు.