COVID in India: భారత్‌లో రెండో దశ కరోనా విలయతాండవం, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,726 పాజిటివ్ కేసులు, గత 10 నెలల్లో ఇదే అత్యధికం, మహారాష్ట్రలో 25 వేలు దాటిన రోజూవారీ కేసులు
India’s COVID-19 (photo-PTI)

New Delhi, March 19: భారత్‌లో కొద్దిరోజుల్లోనే కోవిడ్19 కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కేసులు గడిచిన వారం రోజుల్లోనే సుమారు 39 శాతం పెరిగాయి. మహారాష్ట్రలో మళ్లీ భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండగా, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్ ఘర్, తమిళనాడు మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇటీవల కాలంగా సుమారు వెయ్యికి చొప్పున కేసులు నమోదవుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్ ఆంక్షలు, రాత్రి పూట కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. గతంలో లాగా వైరస్ విస్తరించకుండా ప్రజలు కఠిన కోవిడ్ నిబంధనలు పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక కోవిడ్ సెకండ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది నవంబర్ నుంచి చూస్తే ఇదే అత్యధికం. అయితే దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల్లో ఎక్కువ శాతం మహారాష్ట్ర నుంచే ఉంటున్నాయి. గడిచిన ఒక్కరోజులో మహారాష్ట్రలో 25,833 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,15,14,331కు చేరింది. నిన్న ఒక్కరోజే 154 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,59,370 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,654 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,10,83,679 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,71,282 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.26 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.36 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.38% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 18 వరకు దేశవ్యాప్తంగా 23,13,70,546 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,57,383 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. తాజా గణాంకాల ప్రకారం 3,93,39,817 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.