Coronavirus in India: దేశంలో తాజాగా 3,48,421 మందికి కరోనా, గ‌త 24 గంట‌ల్లో 4205 మరణాలు, దేశంలో 37,04,099 యాక్టివ్‌ కేసులు, కొత్త‌గా 3,55,338 మంది డిశ్చార్జ్
Coronavirus-in-India ( photo-PTI)

New Delhi, May 12: దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3,48,421 పాజిటివ్ కేసులు (India Coronavirus) న‌మోద‌య్యాయి. ఇందులో 37,04,099 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, 1,93,82,642 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో 4205 మంది మ‌ర‌ణించ‌గా మొత్తం మరణాల సంఖ్య 2,54,197కు చేరుకుంది. కొత్త‌గా 3,55,338 మంది వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. అదేవిధంగా 17,52,35,991 మందికి క‌రోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామ‌ని వెల్ల‌డించింది.

ఇక నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో 4205 మంది బాధితులు మృతిచెందారు. ఒకేరోజు ఇంత భారీసంఖ్య‌లో క‌రోనా బాధితులు మ‌ర‌ణించ‌డం ఇదే మొద‌టిసారి. గ‌త శుక్ర‌వారం అత్య‌ధికంగా 4185 మంది చ‌నిపోయిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు దానికంటే 20 మంది అధికంగా మృతిచెందారు. దీంతో గ‌త 14 రోజుల్లో 50 వేల మంది క‌రోనాతో క‌న్నుమూశారు. అంటే రోజుకు 3528 మంది చొప్పున చ‌నిపోయార‌న్న‌మాట‌. తాజా మ‌ర‌ణాల‌తో మొత్తం మృతులు 2.5 ల‌క్ష‌లు దాటారు.

భార‌త్‌ను ఆదుకుంటున్న ప్రపంచదేశాలు, రూ.2.22 కోట్లు అత్యవసర విరాళంగా ప్రకటించిన ఈఐబీ, 19 కోట్ల నుంచి 25 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇస్తామని తెలిపిన గవీ, 10,000 ఆక్సిజన్ కాన్స‌న్‌ట్రేట‌ర్లను పంపిన ఐక్యరాజ్య సమితి

మ‌హారాష్ట్ర‌లో మ‌రోమారు మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త రెండు రోజులుగా 600 కంటే త‌క్కువ‌గా న‌మోద‌వుతుండ‌గా, ఇప్పుడ‌ది 793కు చేరింది. త‌మిళ‌నాడులో 241 నుంచి 298కి పెరిగాయి. ఇలా దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రోజువారీ మ‌ర‌ణాలు అధిక‌మ‌య్యాయి. మొద‌టి నుంచి అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతూ వ‌స్తున్న మ‌హారాష్ట్ర‌లో రోజువారీ కేసులు త‌గ్గుతుండ‌గా, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ప‌శ్చిమ‌బెంగాల్‌, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో క్ర‌మంగా అధిక‌మ‌వుతున్నాయి. 26 రాష్ట్రాల్లో 15 శాతం పాజిటివిటీ రేటు ఉండ‌గా, ఈ రాష్ట్రాల్లో మాత్రం 25 శాతం పాజిటివిటీ రేటు న‌మోద‌వుతున్న‌ది.