New Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను విధానం, రూ.3 లక్షలు దాటితే పన్ను, మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదంటున్నారు, ఎలా సాధ్యమో తెలుసుకోండి
Income Tax (Photo-IANS)

ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి (New Income Tax Rules) కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కాగా ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే అలాంటివారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2023 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.

వేతన జీవులకు ఊరటనిచ్చిన కేంద్రం, రూ. 7లక్షల ఆదాయం వరకు ఎలాంటి ట్యాక్స్‌ లేదని ప్రకటన, పన్ను మినహాయింపు రూ.5లక్షల నుంచి 7లక్షలకు పెంపు

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని 2023 బడ్జెట్‌లో రూ.12,500 నుంచి రూ.25,000కి పెంచింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం భారత్‌లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ప్రవాసభారతీయులు (ఎన్నారైలు), హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు వంటి ఈ రాయితీకి అనర్హులుగా పరిగణింపబడతారు. ఇక జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్‌లో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది. ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది.

ఆదాయపు పన్ను కడుతున్నారా? ఈ మార్గాల ద్వారా మీరు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదని ఎలా చెబుతున్నారని చాలా మంది అయోమయంలో ఉన్నారు. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.