Firing on Asaduddin Owaisi Car: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాల్పులు, సురక్షితంగా బయటపడ్డ అసద్, టోల్ ప్లాజా దగ్గర 3-4 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు, పోలీసుల అదుపులో ఒక నిందితుడు

New Delhi Feb 03: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై (Asaduddin Owaisi ) దాడి జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు నలుగురు దుండగులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో(Uttar Pradesh) చోటుచేసుకుంది. తన వాహనంపై మూడు రౌండ్ల కాల్పులు(Firing on owaisi) జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. సురక్షితంగా బయటపడిన ఆయన కాల్పుల ఘటన విషయాన్ని ట్విటర్‌ వేదికగా తెలిపారు.

మీరట్ జిల్లా కితౌర్‌లో ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్‌ పాల్గొన్నారు. ప్రచారం అనంతరం ఢిల్లీకి వెళ్తుండగా ఛాజర్సీ టోల్‌ప్లాజా (Chhijarsi toll gate) వద్ద కాల్పులు జరిగినట్లు అసదుద్దీన్‌ తెలిపారు. టోల్‌ప్లాజా వద్ద ఇద్దరు వ్యక్తులు 3-4 రౌండ్లు కాల్పులు జరిపారన్నారు. షూటర్లు ఆయుధాలను అక్కడే వదిలేసి పరారయ్యారన్నారు. కాల్పుల్లో తన కారు టైర్లు పంక్చర్‌ కావడంతో మరో వాహనంలో ఢిల్లీకి వెళ్లినట్టు అసదుద్దీన్‌ తెలిపారు. తామంతా సురక్షితంగా బయటపడినట్టు ట్వీట్ చేశారు.

ఢిల్లీ చేరుకున్న అనంతరం అసదుద్దీన్‌ (Asaduddin Owaisi) మీడియాతో మాట్లాడారు. తన కారుపై కాల్పుల ఘటనలో ఓ షూటర్‌ని అరెస్టు చేసి.. ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తనకు సమాచారం ఇచ్చారని అసదుద్దీన్‌ చెప్పారు. ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్టు చెప్పారు. స్వతంత్ర దర్యాప్తు జరపడం ఉత్తర్‌ ప్రదేశ్‌, కేంద్ర ప్రభుత్వాలదే బాధ్యత అన్నారు. ఈ అంశంపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలవనున్నట్టు తెలిపారు.

అసదుద్దీన్‌ కారుపై కాల్పుల ఘటనలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు హాపూర్ ఎస్పీ దీపక్‌ భుకేర్‌ వెల్లడించారు. అతడి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నాడనీ.. ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు ఏమైనా ఉంటే మీడియాకు వెల్లడిస్తామన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.