Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, March 5: కరోనావైరస్ గతంలో కంటే ఇప్పుడు మరింత వేగంగా మ్యూటేట్ అవుతోందని 'ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్' పేర్కొంది. కేసులు పెరుగుతున్న పలు నగరాల్లో శాంపుల్స్ సేకరించగా కొత్త వేరియంట్ కరోనా రకాలు బయటపడుతున్నాయని IISC వెల్లడించింది. ఈ క్రమంలో వైరస్ వేగంగా విస్తరిస్తూ పలు రాష్ట్రాల్లో రోజూవారి కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారత్‌లో గత కొంతకాలంగా 1.37 శాతం కంటే దిగువకు పడిపోయిన కోవిడ్19 ఆక్టివ్ కేసులు శుక్రవారం ఉదయం నాటికి 1.58 శాతానికి పెరిగాయి.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 16,838 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,11,73,761కు చేరింది. నిన్న ఒక్కరోజే 113 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,57,548కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,819 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,08,39,894 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,76,319 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.01% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.58% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.41% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఇక మార్చి 4 వరకు దేశవ్యాప్తంగా 21,99,40,742 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,61,834 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 1 కోటి 80 లక్షల మంది వ్యాక్సిన్ పొందినట్లు అంచనా. తాజా గణాంకాల ప్రకారం 1,80,05,503 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.