Telangana: సిఎఎకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానిస్తే గవర్నర్ తమిళిసై అదే పనిచేస్తారా? కేరళ గవర్నర్‌ను అనుసరించనున్న తెలంగాణ గవర్నర్
Telangana Governor Tamilisai Soundararajan & CM KCR | File Photo

Hyderabad, March 02: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Session) మార్చి 06 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లోనే పౌరసత్వ సవరణ చట్టంను (CAA) వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ (CM K Chandrashekar Rao)  ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్  (Governor Tamilisai Soundararajan) ఎలాంటి వైఖరి అవలంబిస్తారనేది ఆసక్తికరంగా మారింది. సమావేశాల ప్రారంభానికి ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయాల్సి ఉంటుంది. ఆ ప్రసంగం ద్వారా తెలంగాణ ప్రభుత్వ విధానం, ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ, సిఎఎను తమ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందో సానుకూల దృక్పథంతో గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది.  అయితే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళిసై అంతకుముందు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. ఈ నేపథ్యంలో నేడు ఒక గవర్నర్ గా  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్నే వ్యతిరేకించడమే కాకుండా, ఈ విషయంలో తన సొంత పార్టీ అయిన బీజేపీ వైఖరిని ఎండగడుతూ గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంటుంది.

అయితే ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి గవర్నర్ తమిళిసై ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రసంగం విషయంలో కేరళ గవర్నర్ పంథానే తాను అవలింబించాలనే నిర్ణయం తమిళిసై తీసుకున్నారని నివేదికలు వెల్లడించాయి. కేరళ అసెంబ్లీ సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానం చేసే సమయంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ "నేను ఈ ప్యారాగ్రాఫ్ ఎందుకు చదవాల్సి వస్తుందంటే సీఎం పినరయి విజయన్ చదవమన్నారు కాబట్టి చదువుతున్నాను. నిజానికి ఇది నిబంధనలకు విరుద్ధం, అయినప్పటికీ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇది వారి ప్రభుత్వ వైఖరి కాబట్టి, ముఖ్యమంత్రి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇది చదువుతున్నాను" అంటూ సిఎఎ వ్యతిరేక తీర్మానంపై ప్రసంగం చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా అవలంబించనున్నారని రిపోర్ట్స్ వెల్లడించాయి.  అసదుద్దీన్ ఇలాఖాలో అమిత్ షా షో.. సిఎఎకు మద్ధతుగా హైదరాబాద్‌లో బీజేపీ మెగా ర్యాలీ

ఇదిలా ఉండగా మార్చి 06 నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాలలో 2020-21కి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం సమర్పించనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఇక రైతుబంధు నిధులు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం సిద్ధమవుతోంది.