
Hyderabad, October 27: తెలంగాణలో కొవిడ్19 వ్యాప్తి ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి వస్తోంది, పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి, అయితే వైరస్ నిర్ధారణ పరీక్షలు కూడా తక్కువగా జరుగుతుండటం వలన రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 21,099 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 837 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 412 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,15,516 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,32,671కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 185 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 41, రంగారెడ్డి నుంచి 59, ఖమ్మం నుంచి 76, కొత్తగూడెం నుంచి 48 మరియు కరీంనగర్ నుంచి 51 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 4 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1315కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 1554 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,13,466 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,890 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఇప్పటికైతే పరిస్థితులు అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తున్నా, ఎలాంటి లాక్డౌన్ ఆంక్షలు లేకపోవడం వలన ప్రజలు నిర్భయంగా రోడ్లపై తిరుగుతున్నారు. జనజీవనం అంతా సాధారణంగా ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వైరస్ మళ్లీ తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కొవిడ్19ను అరికట్టడంలో తమ వంతు సహాకారం అందించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.