Happy Indian Army Day 2022: వీరుడా అందుకో వదనం, సరిలేరు మీకెవ్వరు, నేడే భారత ఆర్మీ దినోత్సవం, మన దేశ సైనికులు సాధించిన విజయాలు తెలుసుకోండి..
Army Day 2022

మంచు కొండల్లో, గడ్డ కట్టే చలిలో, మంచు కొండల్లో.. ఎక్కువ ఎండ ఉండే ఎడారులు, లోయల్లో, జోరు వర్షాల్లోనూ నిద్రాహారాలు మానుకుని మనందరికీ రక్షణ కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ సైనికులకు సలాం చేయకుండా ఉండలేరు. మనం ఈ రోజు హాయిగా, స్వేచ్ఛగా బతుకుతున్నామంటే.. దానికి ప్రధాన కారణం భారత సైన్యమే. మన దేశ సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. భారత సైనికుల గురించి, వారి ధైర్య సాహాసాలు, పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే సైనికులను స్మరించుకునేందుకు ఒక ప్రత్యేక రోజును కేటాయించారు. అయితే జనవరి 15వ తేదీ. ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. 1949లో కె.ఎమ్.కరియప్ప భారత సైన్యం యొక్క మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈరోజు. దీనికి ముందు అతను భారత మిలటరీ అధికారి మరియు స్వాతంత్ర్యం తర్వాత, భారతదేశ చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చేర్ నుండి ఈ పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా భారత సైనికుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

>> భారత సైన్యం 1895న ఏప్రిల్ 1వ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఏర్పడింది. దీనిని బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అని పిలుస్తారు. బ్రిటీష్ వారి నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం పొందిన తర్వాత దీనికి భారత సైన్యం అని పేరొచ్చింది.

>> బ్రిటీష్ పాలనలో దేశవ్యాప్తంగా అనేక నిరసనలు మరియు అల్లర్లు జరిగాయి. ఈ కారణంగా, ప్రజలను నియంత్రించండంలో మరియు నిర్వహణలో సహాయం కోసం భారతీయులను సైన్యంలోకి తీసుకున్నారు.

>> 1948 నుండి భారత్-పాకిస్థాన్ పై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఈ కారణంగా సుమారు 6 వేల మీటర్ల ఎత్తు వరకు ఇరు దేశాలు సైన్యాన్ని మొహరించాయి. అత్యంత ఎత్తైన పర్వతాల్లో యుద్ధం చేయడంలో భారత ఆర్మీ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఇండియన్ ఆర్మీకి చెందిన హై అల్టిట్యూడ్ వార్ ఫేర్ స్కూల్(HAWS) ప్రపంచంలోనే అత్యున్నత సైనిక శిక్షణా కేంద్రాల్లో ఒకటి కావడం విశేషం.

>> అమెరికా, చైనా తర్వాత అత్యధిక సైనిక బలం కలిగిన దేశం మన భారతదేశం కావడం విశేషం. మన దేశంలో మొత్తం 13,25,000కి పైగా యాక్టివ్ ట్రూప్స్, 9,60,000 రిజర్వ్ ట్రూప్స్ ఉండటం మనకు గర్వకారణం.

>> 2013లో ఉత్తరాఖాండ్ లో వరదలు వచ్చిన సమయంలో ప్రజలను కాపాడేందుకు ఆర్మీ చర్యలు ప్రపంచంలోనే అతి పెద్ద రెస్క్యూ ఆపరేషన్. 2013, జూన్ 17వ తేదీన జరిగిన ఈ ఆపరేషన్లో సుమారు 20 వేల మంది సహాయసహకారాలు అందించారు. ఈ సందర్భంగా 2 వేలకు పైగా యుద్ధ విమానాలను నడిపింది ఆర్మీ. 3,82,400 కిలోల రిలీఫ్ మెటిరీయల్ ను కూడా సరఫరా చేసింది.