Telangana Formation Day 2021: 'ప్రజల విశ్వాసమే కొండంత ధైర్యం.. బంగారు తెలంగాణ స్థాపనే లక్ష్యం'.. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
Happy Telangana Formation Day (File Image)

Hyderabad, June 2: తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, రోడ్లు, తదితర మౌలిక వసతులను., స్వల్పకాలిక, ధీర్ఘకాలిక లక్ష్యాలతో కల్పన చేసుకుంటూ వస్తున్నామన్నారు. భారత దేశంలో 29 రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ.. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని సీఎం తెలిపారు.

సమైక్యరాష్ట్రంలో విస్మరించబడిన అనేక రంగాలను, ఒక్కొక్కటిగా ఓపికతో, దార్శనికతతో ఎలాంటి అవాంతరాలను లెక్కజేయకుండా సరిదిద్దుకుంటూ వస్తున్నామని సీఎం తెలిపారు. తెలంగాణ సమాజం.. తొంభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో నిండిఉన్న నేపథ్యంలో.. వారి అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని సీఎం పేర్కొన్నారు.

ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది, ధృఢ సంకల్పం, తెలంగాణ పట్ల నిబద్ధత, అన్నిటికీ మించి అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళిని అర్పించాలనే స్పూర్తి ఉందని కేసీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రైతును కాపాడి, వ్యవసాయాన్ని పునరుజ్జీవింప చేయడమే కాకుండా ఏడేండ్ల అనతికాలంలోనే తెలంగాణను భారతదేశానికే అన్నపూర్ణగా నిలపడం వెనక తెలంగాణ ప్రభుత్వం అకుంఠిత దీక్ష ఇమిడి ఉండి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి తెలంగాణ వ్యవసాయాన్ని స్థిరీకరించి, తెలంగాణ గ్రామీణ వ్యవస్థను ఆర్ధికంగా పరిపుష్టం చేయడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ ఘన విజయంలో తెలంగాణ ప్రజల సహకారం మహా గొప్పదని, అందుకు వారికి సీఎం కేసిఆర్ ధన్యవాదాలు తెలిపారు.

కరోనా మహమ్మారి వలన రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామని సీఎం తెలిపారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమని, ప్రజలిచ్చిన భరోసాతో తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించనని సీఎం కేసిఆర్ స్పష్టం చేశారు.

ఇక ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 8:30 గంటలకు జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నిబంధనలు అనుసరించాలని సూచించింది.