IND Vs Nepal: అండ‌ర్ -19 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ కు చేరిన భార‌త్, సూప‌ర్ సిక్స్ లోనూ ఆగ‌ని టీమిండియా విజ‌యాల ప‌రంప‌ర‌
ICC U19 World Cup 2024 (PIC@ ICC X)

South Africa, FEB 02: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న ఐసీసీ అండర్‌ – 19 (U19 World Cup 2024) పురుషుల ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్ల అప్రతీహాత విజయాల పరంపర కొనసాగుతోంది. గ్రూప్‌ స్టేజ్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్‌.. సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లోనూ ఆడిన రెండు మ్యాచ్‌లలో అద్భుత విజయాలు సాధించి సెమీస్‌ చేరుకుంది. బ్లూమ్‌ఫాంటైన్‌ వేదికగా శుక్రవారం నేపాల్‌తో (IND Vs Nepal) ముగిసిన మ్యాచ్‌లో భారత్‌.. 132 పరుగుల తేడాతో ఘన విజయం (India Beat Nepal) సాధించింది. భారత్‌ నిర్దేశించిన 298 పరుగుల ఛేదనలో నేపాల్‌.. 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత యువ స్పిన్నర్‌ సౌమీ పాండే 4 వికెట్లతో చెలరేగాడు. అంతకుముందు భారత ఇన్నింగ్స్‌లో సచిన్‌ దాస్‌ (116), ఉదయ్‌ సహరన్‌ (100) శతకాలతో కదంతొక్కడంతో భారత్‌.. 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. భారీ ఛేదనలో నేపాల్‌ ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. ఓపెనర్లు దీపక్‌ బొహర (42 బంతుల్లో 22, 3 ఫోర్లు), అర్జున్‌ కుమల్‌ (64 బంతుల్లో 26, 3 ఫోర్లు) 13 ఓవర్ల పాటు ఆడి 48 పరుగులు జతచేశారు. రాజ్‌ లింబాని భారత్‌కు (India Beat Nepal) తొలి షాకిచ్చాడు. అతడే వేసిన 13వ ఓవర్‌ రెండో బంతికి దీపక్‌ బొహర.. లింబానికే క్యాచ్‌ ఇచ్చాడు. అప్పట్నంచి నేపాల్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉత్తమ్‌ తపమగర్‌ (8)ను సౌమీ పాండే ఔట్‌ చేశాడు.

 

కెప్టెన్‌ దెవ్‌ ఖనల్‌ (53 బంతుల్లో 33, 2 ఫోర్లు) కొంతసేపు క్రీజులో నిలబడ్డాడు. కానీ అతడికి అండగా నిలిచేవాళ్లే కరువయ్యారు. బిషల్‌ బిక్రమ్‌ (1), దీపక్‌ దుమ్రె (0) , గుల్షన్‌ ఝా (1), దీపేశ్‌ కండెల్‌ (5)లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆఖర్లో ఆకాశ్‌ చంద్‌ (35 బంతుల్లో 19 నాటౌట్‌), దుర్గేశ్‌ గుప్తా ( 43 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్స్‌) లు నేపాల్‌ ఆలౌట్‌ కాకుండా కాపాడారు. ఈ ఇద్దరూ సుమారు 12 ఓవర్ల పాటు క్రీజులో నిలిచి ఆఖరి వికెట్‌కు 45 పరుగులు జోడించడం విశేషం.

ఈ టోర్నీలో భారత్‌.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించగా రెండో మ్యాచ్‌లో యూఏఈని మట్టికరిపించింది. మూడో మ్యాచ్‌లో యూనైటెడ్‌ స్టేట్స్‌ను ఓడించింది. సూపర్‌ సిక్స్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌.. తాజాగా నేపాల్‌ను చిత్తుచేసి సెమీస్‌ బెర్తును ఖాయం చేసుకుంది. సెమీస్‌లో భారత్‌.. సౌతాఫ్రికాను ఎదుర్కోనుంది. వచ్చే మంగళవారం ఈ మ్యాచ్‌ జరుగనుంది.