అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో అగౌరవంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంతో చంద్రబాబుకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టం, సెక్షన్ 14 ప్రకారం కమిషన్కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో తెలిపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు అడ్డుకుని గొడవ పడ్డారని, అక్కడి రోగులను భయాందోళనలకు గురి చేశారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలి అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం మధ్యాహ్నం ఏపీ విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. అత్యచార బాధితురాలు, ఆమె తల్లి సమక్షంలోనే వీరిద్దరూ ఒకరిపై ఆరోపణలు చేసుకున్నారు. బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ రాగా అప్పటికే అక్కడికి చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో ఆసుపత్రికి చేరుకున్న టీడీపీ శ్రేణులు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బొండా ఉమా, టీడీపీ నేతలు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. చంద్రబాబు బాధితురాలిని పరామర్శించడానికి వస్తే ఇప్పటికిప్పుడు మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వచ్చి హడావిడి చేశారనిస్తున్నారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.