YSR Kapu Nestham: కాపుల నేస్తంగా సీఎం జగన్ పథకం, ఆంధ్ర ప్రదేశ్ కేబినేట్ సమావేశంలో 'వైఎస్ఆర్ కాపు నేస్తం' పథకానికి ఆమోదం, మంత్రివర్గం భేటీలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి
AP Cabinet Meet Highlights | File Photo.

Amaravathi, November 27: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan) అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ (AP Cabinet) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఆర్థిక సహాయం, విద్యార్థుల కోసం జగనన్న వసతి ప్రయోజన పథకం, స్టీల్ కార్పోరేషన్ ఏర్పాటు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వైఎస్ఆర్ నవశకం పథకానికి లబ్దిదారుల ఎంపిక, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై కూడా కేబినేట్ చర్చించింది.

ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ కేబినేట్ భేటీకి సంబంధించిన విశేషాలను రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

ఏపీ మంత్రివర్గ సమావేశం ముఖ్యాంశాలు

 

  • వైఎస్ఆర్ కాపు నేస్తం (YSR Kapu Nestham) పథకానికి రూ. 1101 కోట్లు కేటాయింపు. ఈ పథకం కింద 45 ఏళ్లు నిండిన కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సహాయం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీని ప్రకారం ఐదేళ్లలో రూ. 75 వేలు చెల్లించడానికి కేబినేట్ ఆమోదం తెలిపింది.
  • జగనన్న వసతి దీవెన పథకానికి రూ. 2,300 కోట్లు, జగనన్న విద్యా దీవెన పథకానికి రూ. 3,400 కోట్లు కేటాయింపు
  • జగనన్న వసతి దీవెనకి రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెనకి రూ.3400కోట్లు కేటాయింపు. జగనన్న వసతి పథకం కింద మెస్ ఛార్జీల కోసం ఐటిఐ విద్యార్థులకు సంవత్సరానికి రూ .10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ .15 వేలు, డిగ్రీకి రూ .20 వేలు, రెండు విడతల్లో డిసెంబర్, జూలై నెలల్లో అందజేయబడతాయి.
  • నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఖరారు చేయాలని నిర్ణయం.
  • కడప స్టీల్ ఫ్యాక్టరీకి ముడిసరుకు సరఫరా మరియు జమ్మలమడుగు మండలంలో 3,200 ఎకరాల్లో ఉక్కు పరిశ్రమను స్థాపించడానికి NMDCతో చేసుకున్న ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించింది.
  • AP హైబ్రిడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
  • APSPDCLను విభజించి పవర్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • సంక్షేమ పథకాలకు వేర్వేరు కార్డుల జారీకి కేబినేట్ ఆమోదం తెలిపింది. వార్షిక ఆదాయం రూ. 2,50,000, 10 ఎకరాల మాగాణి భూమి, 25 ఎకరాలలోపు మెట్ట భూమి కలవారు అర్హులుగా పేర్కొంటూ మార్గదర్శకాల సవరణలను కేబినెట్ ఆమోదించింది,
  • కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • టిటిడి ట్రస్ట్ సభ్యులను 19 నుండి 29 కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.