Andhra Pradesh: పొట్టకూటి కోసం విదేశాలకు, ఏజెంట్ మోసం చేయడంతో పడరాని పాట్లు, APNRTS సాయంతో రాష్ట్రానికి చేరుకున్న ఎనిమిది మంది వలసదారులు
వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు APNRTS ప్రయత్నాలు ఫలించడంతో 8మంది వలస కార్మికులు విజయవాడ చేరుకున్నారు.
Srikakulam, Sep 27: ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 08 మంది వలసదారులు అక్రమ ఏజెంట్ మాయమాటలు నమ్మి ఒమాన్ కు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి విదితమే. వీరిని రాష్ట్రానికి తీసుకురావడానికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున APNRTS ఒమాన్ లోని భారత రాయబార కార్యాలయంతో ఇమెయిల్ ద్వారా పలుమార్లు సంప్రదించింది. వసతి, ఆహార సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న వారిని భారతదేశం పంపాలని, అక్రమ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని APNRTS కోరింది. ఎట్టకేలకు APNRTS ప్రయత్నాలు ఫలించడంతో 8మంది వలస కార్మికులు విజయవాడ చేరుకున్నారు.
అయిదు నెలల క్రితం ఉద్యోగాల నిమిత్తం ఓ ఏజెంట్ ద్వారా ఈ ఎనిమిది మంది వలసకార్మికులు ఒమాన్ వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళాక ఏజెంట్ ఉద్యోగాలు ఇప్పించకపోవడం తో, ఉద్యోగాలు లేక ఆ దేశంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కొద్దిరోజుల క్రితం సామాజిక మాధ్యమాలలో వచ్చాయి. స్వదేశానికి చేరుకున్న తర్వాత బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... సదరు వ్యక్తి ఏజెంట్ గా వ్యవహరిస్తూ ఒమాన్ లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చి ఈ 8 మంది నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి వీసాలు ఏర్పాటు చేసి ఒమాన్ దేశం తీసుకెళ్ళాడు.
అక్కడికి వెళ్ళాక ఏజెంట్ చెప్పిన ఉద్యోగాలు కల్పించకపోగా, సరైన వసతి మరియు భోజనం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై వారు సదరు ఏజెంట్ ని నిలదీయగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఉద్యోగాలు లేవు ఏం చేసుకుంటారో మీ ఇష్టం అని హెచ్చరించి, మమ్మల్ని రోడ్డున పడేశారని తెలిపారు. దిక్కుతోచని స్థితిలో భారతదేశానికి రావడానికి సహాయం కొరకు శ్రీకాకుళం జిల్లా SP గారిని మరియు APNRTS ను సంప్రదించారు.
జిల్లా SP శ్రీమతి రాధిక గారు వలస కార్మికుల వివరాలను APNRTS కు పంపారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక, మత్య్సశాఖాభివృద్ది మంత్రి గౌరవనీయులు డా. సీదిరి అప్పలరాజు గారు ఈ విషయమై వలసకార్మికుల క్షేమ సమాచారాలు తెలుసుకోవాలని, త్వరితగతిన వారిని స్వదేశానికి రప్పించాలని APNRTS ను కోరగా, తక్షణమే స్పందించిన APNRTS బాధితుల నుండి మరిన్ని వివరాలను సేకరించి, ఒమాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీకి వారి పరిస్థితిని వివరిస్తూ, సదరు ఏజెంట్ పై చర్య తీసుకోవాలని మరియు వారిని ఒమాన్ నుండి భారతదేశానికి తిరిగి రావడానికి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరింది. అంతేకాకుండా తక్షణ సహాయంగా ఏపిఎన్ఆర్టి సొసైటీ కో-ఆర్డినేటర్ శ్రీ.వేమన కుమార్ మరియు సామాజిక కార్యకర్తలు శ్రీ.నిత్యానంద మరియు శ్రీ. బాలకృష్ణలు ఒమాన్ లోని సలాలాహ్ ప్రాంతంలో తాత్కాలిక వసతి కల్పించారు. ఈ విషయం పై APNRTS నిరంతరం బాధితులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పించడమే కాకుండా, ఏపీ పోలీస్ ఎన్నారై సెల్ ద్వారా సదరు ఏజెంట్ పై ఒత్తిడి తెచ్చి 08 మంది భారతదేశానికి తిరిగి రావటానికి అయ్యే ఖర్చును ఎంబసీ అధికారుల ద్వారా అక్కడి కోర్టులో జమ చేసి, ఎంబసీ వారి సహకారంతో ఆ 08 మంది వలస కార్మికులు ఇవాళ క్షేమంగా స్వరాష్ట్రం చేరుకున్నారు.
ఈ సందర్భంగా APNRTS అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి గారు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రవాసాంధ్రుల అభివృద్ధి, భద్రత, సంక్షేమమే ధ్యేయంగా APNRTS నిరంతరం పనిచేస్తోందన్నారు. విదేశాలకు వెళ్లే వారు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికోసం APNRTS సక్రమ వలసల పై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ఎవరూ అక్రమ ఏజెంట్ల చేతిలో మోసపోవద్దని, విదేశాంగ వ్యవహారాల శాఖ (MEA) ద్వారా ఆమోదింపబడిన రిక్రూట్మెంట్ ఏజెంట్ల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్ళాలని సూచించారు.
సీఈవో శ్రీ దినేష్ కుమార్ గారు మాట్లాడుతూ విదేశాలకు వెళ్ళే వారు, విదేశాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మీకున్న సందేహాలు, సమస్యలు ఉంటే APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, +91 8500027678 (వాట్సాప్) సంప్రదించగలరని తెలిపారు.
ఈ నేపథ్యంలో స్వరాష్ట్రం చేరుకున్న 08 మందిలో కె. నాయుడు మరియు టి. నీలకంఠం మాట్లాడుతూ, మేమందరం క్షేమంగా భారతదేశానికి రావటానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఏపీఎన్ఆర్టిఎస్ అధ్యక్షులు శ్రీ వెంకట్ ఎస్. మేడపాటి మరియు సీఈఓ దినేష్ కుమార్ గార్లకు, అలాగే ఒమాన్ దేశంలో మాకు వసతి ఏర్పాటు చేసి, మాకు కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేయడంతో పాటు మేము భారతదేశానికి రావటానికి అవసరమైన పేపర్ వర్క్ తదితర ఏర్పాట్లు చేసిన ఏపిఎన్ఆర్టి సొసైటీ కో-ఆర్డినేటర్ శ్రీ వేమన కుమార్ మరియు సామాజిక కార్యకర్తలు శ్రీ.నిత్యానంద మరియు శ్రీ. బాలకృష్ణ గార్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
(The above story first appeared on LatestLY on Sep 27, 2022 09:08 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

