Andhra Pradesh Elections 2024: ఐదేళ్ల జగన్ పాలనలో గుండా, రౌడీ రాజ్యం, కలికిరిలో ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు, విజయవాడలో ముగిసిన ప్రజాగళం రోడ్ షో
PM Modi in BJP Vijaya Sankalpa Sabha (photo-Video Grab)

Vjy, May 8: విజయవాడలో నిర్వహించిన ప్రజాగళం రోడ్ షోలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. వేలాదిగా మూడు పార్టీల శ్రేణులు తరలివచ్చి జయప్రదం చేసిన ఈ రోడ్ షో మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమై బెంజి సర్కిల్ వద్ద ముగిసింది. బెంజి సర్కిల్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న రైతులు, మహిళలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. ఈ రోడ్ షోతో ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసినట్టయింది. రాష్ట్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఒకే రోజున లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో ఈ ఎన్నికల్లో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ అభివృద్ధి, ఏపీ వికాసమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడిందని మండిపడ్డారు. జగన్ పాలనలో పేదలు ఎవ్వరూ అభివృద్ధి కాలేదని, మాఫియా నేతలు మాత్రం అభివృద్ధి అయ్యారని విమర్శించారు.  తెలంగాణలో RR ట్యాక్స్ వెయ్యి కోట్లు దాటేసింది, వేములవాడలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన ప్రధాని మోదీ, బండి సంజయ్‌ విజయం ముందే నిర్ణయమైందని వెల్లడి

రాజంపేట పార్లమెంటు పరిధిలోని కలికిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ప్రధాని మోదీ, మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన నేత నాగబాబు, కూటమి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ రెడ్డిపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఐదేళ్ల వైసీపీ పాలనలో గుండా, రౌడీ రాజ్యం పాలన సాగిందని విమర్శించారు. ఇసుక మాఫియా వల్ల అన్నమయ డ్యాం కొట్టుకుపోయిందని అన్నారు. వైసీపీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని.. వీరికి రాబోయే రోజుల్లో పక్కా ట్రీట్మెంట్ ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ సురక్షిత నీరు ఇవ్వాలని తాము అనుకుంటే.. రాష్ట్రంలో అమలు చేయకుండా వైసీపీ అడ్డుకుందని ధ్వజమెత్తారు. బలమైన పాలన రాష్ట్రాల్లో ఉంటే దేశానికి బలమని అన్నారు. బీజేపీ పాలనలో గల్ఫ్‌లో భారతీయులకు గౌరవం పెరిగిందని అన్నారు. కతర్ నుంచి సురక్షితంగా మన దేశీయులను తీసుకొచ్చామన్నారు. అదే కాంగ్రెస్ పాలనలో సాధ్యం కాలేదని చెప్పారు. దేశం అభ్యున్నతి కోసం తాను పని చేస్తుంటే, కాంగ్రెస్ దేశాన్ని వెనక్కు తీసుకుపోతానని చెబుతోందని ధ్వజమెత్తారు.

ఆర్టికల్ 370ను దేశంలో తిరిగి తెస్తుందట, కామన్ సివిల్ కోడ్ ను కూడా అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. తమ పాలనలో రామ మందిర నిర్మాణం పూర్తి అయితే, కాంగ్రెస్ దేశంలో అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తానని చెబుతోందన్నారు. దేశ విభజనను చేయాలని కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. దేశ గౌరవం తగ్గేలా ఇతర దేశాల్లో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. దక్షిణాదిలో బులెట్ రైళ్లు తెస్తామని... ఏపీలో కూడా ఈ రైలు పరుగులు తీస్తుందని అన్నారు. రాయలసీమ రైతుల జీవితాల్లో ఎన్డీఏ పాలనలో మాత్రమే వెలుగులు వస్తాయని చెప్పుకొచ్చారు. టమాటా రైతులకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత క్షేమం కోసం ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు.