Sucharitha Quits Assembly: ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా, సీఎం జగన్ వెంటే కొనసాగుతానని వెల్లడి, మాజీ హోం మంత్రి బాటలో పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలు
Former home minister Sucharitha (Photo-Video Grab)

Amaravati, April 11: ఏపీలో మంత్ర వర్గ పునర్వ్యవస్థీకరణ వ్యవహారం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో (YSRCP) ప్రకంపనలను సృష్టిస్తోంది. పదవులను కోల్పోయిన నాయకులు రాజీనామా బాట పట్టారు. కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకుని, అవి అందకపోవడం వల్ల నిరాశకు గురైన ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ప్రత్యేకించి- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో దీని తీవ్రత అధికంగా ఉంటోంది.

తనను మంత్రివర్గం నుంచి తప్పించడాన్ని నిరసిస్తూ మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత (Sucharitha Quits Assembly) రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు అందజేశారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె వెల్లడించారు. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేశారని, బుజ్జగింపులకు లొంగదలచుకోలేదని తేల్చి చెప్పారు. మంత్రివర్గం నుంచి తప్పించడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తన తల్లి ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేశారని.. పార్టీకి కాదని సుచరిత కూతురు తెలిపారు.

సుచరితను (Former home minister Sucharitha) కలిసేందుకు వచ్చిన మోపిదేవిని కూడా సుచరిత అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సీఎం జగన్ కు, సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాదు పార్టీలో రెడ్లకో న్యాయం.. ఎస్సీలకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. బాలినేని ఇంటికి సజ్జల వెళ్లి బుజ్జగించారని.. కానీ సుచరితను మాత్రం పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కాగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని ఆమె నివాసానికి మోపిదేవి వెళ్లారు. మంత్రి పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను వివరించారు. ముఖ్యమంత్రి వైెఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో ఎవరికీ ఇవ్వని ప్రాధాన్యతను ఇచ్చారని అనునయించారు.

 ఇకపై జగన్‌ గ్యారేజీలో పనిచేస్తాం, అసంతృప్తి జ్వాలలు త్వరలోనే సర్దుకుంటాయి, రాష్ట్ర, పార్టీ భవిష్యత్‌ కోసం సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తామని తెలిపిన మాజీ మంత్రులు

ఈ సందర్భంగా సుచరిత ఇంటివద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మోపిదేవి వచ్చిన విషయం తెలుసుకుని సుచరిత అనుచరులు పెద్ద ఎత్తున ఆమె నివాసానికి చేరుకున్నారు. సుచరితను కేబినెట్‌లో కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన తమ నాయకురాలిని మోసం చేశారంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. మోపిదేవి వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

దళిత సామాజిక వర్గానికే చెందిన తానేటి వనిత, కే నారాయణస్వామి, పినిపె విశ్వరూప్, ఆదిమూలపు సురేష్‌ను కొనసాగిస్తూ తనను మాత్రమే తొలగించడం వల్లే సుచరిత అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నారు. ఆమెను తప్పించడానికి సామాజిక వర్గాల సమీకరణ మాత్రమే కాకుండా.. అత్యంత కీలకమైన హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలను సుచరిత ఆశించిన స్థాయిలో నిర్వహించకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నాయి వైసీపీ వర్గాలు. అటు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నారు. రాజీనామాకు సిద్ధపడ్డారు.

ఏపీ నూతన మంత్రుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం, తొలుత మంత్రిగా ప్రమాణం చేసిన సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఏపీ నూతన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అప్ డేట్స్ ఇవే..

ఏది ఏమైనా ఈ వ్యవహారం రెండు మూడు రోజుల్లో సమసిపోయే అవకాశం ఉందని, సుచరిత తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి తన అసంతృప్తి తెలవాలనే కోణంలోనే ఆమె రాజీనామా చేశారని అర్థమవుతోంది. తన రాజీనామా లేఖను నేరుగా స్పీకర్ కి కాకుండా పార్టీకి పంపించారు అంటే, తన అసంతృప్తిని తెలుపుకోవడానికే ఇలా చేశారని ఆ పార్టీ నేతలు అంటున్నారు

ప్రకాశం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఒంగోలు శాసన సభ్యుడు, విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఆయనను బుజ్జగించడానికి పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. పార్టీ పెద్దలు ఆయనను బుజ్జగించారు. గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా రాంబాబు సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. కేబినెట్‌లో చోటు దక్కుతుందంటూ ఆశపెట్టారని, తన సామాజిక వర్గానికెవరికీ చోటు కల్పించలేదని మండిపడుతున్నారాయన.

14 మంది కొత్త ముఖాలకు వైఎస్ జగన్ మంత్రి వర్గంలో చోటు, 11 మంది సీనియర్లకు మరోసారి అవకాశం, మొత్తం 25 మందితో మంత్రి వర్గం ఏర్పాటు

బాలినేనిని కేబినెట్‌ నుంచి తొలగించడం... అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. బాలినేనిని బుజ్జగించేందుకు ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తొలుత... ఆదివారం ఉదయం విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా వెళ్లారు. ‘ఆదిమూలపు సురేశ్‌ను కూడా తొలగిస్తున్నాం. మీ జిల్లా నుంచి ఎవరూ కేబినెట్‌లో ఉండరు’ అని సజ్జల చెప్పారు. దీంతో... బాలినేని శాంతించారు. సర్దుకుపోయేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రానికి సీన్‌ మారిపోయింది. తుది జాబితాలో ఆదిమూలపు పేరూ కనిపించడంతో బాలినేని హతాశులయ్యారు.

ఈసారి తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు.   సీఎం జగన్ వద్ద జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కోటరీగా ఏర్పడ్డారని, వారి కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని భావిస్తున్నానని పరోక్షగా కోడలి నాని, పేర్ని నానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. 2012 వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యేగా తానే తొలుత పార్టీలో‌ చేరినట్లు చెప్పారు. జగన్‌ను అరెస్టు చేస్తే... జిల్లాలో పార్టీ కోసం పని చేశానన్నారు.

ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకునేవాళ్ల జాబితా ఇదే, ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఫైనల్ చేసిన సీఎం జగన్

తన తరువాత వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చినా తాను బాధ పడలేదన్నారు. రెండో విడత ఇస్తారని భావించానని.. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మొదటి నుంచీ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, పదవి వచ్చినా.. రాకున్నా.. జగన్‌కు విధేయునిగా ఉంటానని స్పష్టం చేశారు. మోపిదేవి, సజ్జల కూడా తనతో మాట్లాడారని, కాపులు నలుగురికి ఇచ్చారు... అందులో తాను గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గతంలొ జగన్ స్వయంగా కాబోయే మంత్రిగా తనను ప్రకటించారని చెప్పారు.