Andhra Pradesh: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు, సమీర్‌ శర్మపై దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ కొట్టివేత
AP High Court (Photo-Video Grab)

VJY, Nov 30: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు (AB Venkateswara Rao) హైకోర్టులో చుక్కెదురు అయింది. సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం చెల్లించడంలేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సమీర్‌ శర్మపై (Dr. Sameer Sharma) వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మంగళవారం కొట్టేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తుది దశకు చేరుకోనందువల్ల సీఎస్‌ చర్యలను ఉద్దేశపూర్వక ఉల్లంఘనగా పరిగణించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

ఏపీలో రానున్న రెండు రోజుల్లో మళ్లీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం, బులిటెన్ విడుదల చేసిన ఐఎండీ

తరువాతి కాలంలో సీఎస్‌ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు వస్తాయని వెంకటేశ్వరరావు భావిస్తే తగిన పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై జస్టిస్‌ సోమయాజులు ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది.

సమీర్‌ శర్మ తరపు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాల వ్యవహారంలో వెంకటేశ్వరరావుపై నమోదైన కేసు విచారణ తుది దశలో ఉందన్నారు.సుప్రీం కోర్టు కేసు పూర్వాపరాల ఆధారంగా ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టేయలేదని, సస్పెన్షన్‌ రెండేళ్లకు మించి ఉండరాదన్న నిబంధనను మాత్రమే అనుసరించిందన్నారు.

ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్, 6,100 పోలీస్‌ కానిస్టేబుల్స్‌, 420 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని సర్వీసులోకి తీసుకుందని, అంతమాత్రాన జీత భత్యాలన్నీ ( Non-payment Of Salary) చెల్లించాలని ఓ హక్కుగా కోరడానికి వీల్లేదన్నారు. విచారణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగికి పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లించాలా లేదా అన్నది ప్రభుత్వ విచక్షణ అని చెప్పారు.వెంకటేశ్వరరావుపై విచారణ ముగిసి, నిర్ణయం వెలువడిన తరువాత, సస్పెన్షన్‌ సమర్థనీయం కాదని ప్రభుత్వం భావిస్తేనే తగిన ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. కాబట్టి సీఎస్‌ చర్యలు ఉద్దేశపూర్వక ఉల్లంఘన కిందకు రావన్నారు. మహేశ్వరరెడ్డి వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.

ఏబీ తరపున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టేసి, జీత భత్యాలు చెల్లించాలని ఆదేశించిందన్నారు. సుప్రీం కోర్టు కూడా సస్పెన్షన్‌ను ఎత్తివేసిందన్నారు. అయినా సస్పెన్షన్‌ కాలానికి జీతభత్యాలు చెల్లించడంలేదని, ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని చెప్పారు.