AP Local Body Elections: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు, న్యాయపరమైన ఇబ్బందులు లేవని తెలిపిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్
AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, Nov 17: ఏపీలో వచ్చే ఏడాది పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు (AP Local Body Elections 2020) జరగనున్నాయని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ (SEC Nimmagadda Ramesh Kumar) తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని.. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ఇవని పేర్కొన్నారు.

ఏపీలో కరోనా (AP Coronavirus) ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు (GHMC Elections 2020)  కూడా జరుగుతున్నాయని, ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను (AP Local Body elections ) దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు.

రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్‌ స్పష్టం చేశారు.

 సీఎం ప‌ద‌వి నుంచి వైఎస్ జ‌గ‌న్‌ను తొలగించాలని పిటిషన్, కేసు నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలిపిన జ‌స్టిస్ ల‌లిత్, ఏపీ హైకోర్టు న్యాయ‌మూర్తుల తీరును ఖండిస్తూ సీజేఐకి ఏపీ సీఎం లేఖ

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఆపాలని ఏపీ సీఎస్‌కు ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్ లేఖ రాశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉందని అది పూర్తయ్యేదాకా జిల్లాల పునర్విభజన చేయడం తగదని ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. కాగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఇప్పటికే సన్నహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలని, అదనంగా గిరిజన జిల్లాను ఏర్పాటు చేసి... మొత్తం 26 జిల్లాలుగా విభజించాలని నిర్ణయించారు.

దీనిపై ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. 13 జిల్లాల ప్రాతిపదికన ఎన్నికల ప్రక్రియ చేపట్టామని ఎన్నికలు పూర్తయ్యే వరకు 13 జిల్లాలే ఉండాలనని ఏపీ ఎస్ఈసీ తెలిపారు. అయితే జిల్లాల సంఖ్య పెంచడం వల్ల జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వహణకు సాంకేతిక సమస్యలు ఎదురవుతాయన్నారు.