Kandukur Shocker: తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని..కూతురు, భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించిన శాడిస్ట్, చికిత్స పొందుతూ కూతురు మృతి, ఆస్పత్రిలో నిందితుని భార్య, కందుకూరులో దారుణ ఘటన
Representational image | Photo Credits: Flickr

Ongole, August 17: మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ శాడిస్ట్ భర్త తన భార్య కూతురుపై పెట్రోలు పోసి (Andhra Pradesh man sets wife, daughter on fire) నిప్పంటించాడు. చెడు వ్యసనాలకు బానిసైన ఆ భర్త మృగాడిగా (Husband) మారి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో చికిత్స పొందుతూ కుమార్తె ప్రాణాలు వదలగా, భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

కందుకూరు పోలీసులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాల మేరకు ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మాచవరం గ్రామానికి చెందిన కె.శ్రీనివాసరెడ్డికి అదే గ్రామానికి చెందిన సుశీలతో 30ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుమార్తె ప్రియాంక (27) మానసిక దివ్యాంగురాలు. శ్రీనివాసులరెడ్డి బేల్దారి పనులు చేస్తుంటాడు. సుశీల గ్రామంలో కూలి పనులకు వెళ్తుంటుంది. బిడ్డ పుట్టిన కొంత కాలం నుంచి భార్య, భర్త మధ్య గొడవలు జరుగుతుండేవి.

భార్యపై అనుమానం కూడా తలెత్తింది. గొడవల కారణంగా శ్రీనివాసరెడ్డి కొన్నాళ్లు భార్య, కూతురిని వదిలి హైదరాబాద్, బెంగళూరు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటుండేవాడు. తిరిగి వచ్చినప్పుడుల్లా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఘర్షణలకు దిగేవాడు. ఈ నేపథ్యంలో భార్య, భర్తల మధ్య గొడవలు పడి పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లారు. ఇలా తాగుడుకు అలవాటు పడిన శ్రీనివాసరెడ్డి డబ్బుల కోసం, భార్యపై అనుమానంతో భార్యను, కూతురిని ఇంట్లో పెట్టి తలుపువేసి వెళ్తుంటాడు.

దారుణం..భార్యను రోకలి బండతో కొట్టి, కత్తితో గొంతును కోసి చంపేసిన కసాయి భర్త, అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానమే కారణం, కేసును దర్యాప్తు చేస్తున్న అనంతపూర్ డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ కత్తి శ్రీనివాసులు

ఈ విధంగానే శనివారం కూడా చేశాడు. తిరిగి రాత్రి భార్యతో గొడవపడి డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని లుంగీతో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో వారించి చుట్టు పక్కల వారు సర్దిచెప్పారు. ఈ గొడవలు రోజు ఉండేవేనని తల్లీ కూతుళ్లు ఇంటి ముందు దోమతెర వేసుకొని నిద్రిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి నిద్రపోయేందుకు మిద్దె మీదకు వెళ్లాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఆదివారం తెల్లవారు జామున మిద్దెమీద నుంచి తల్లీ కూతుళ్లపై పోసి నిప్పంటించాడు.

మంటలు రావడంతో భార్య కూతురు పెద్దగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి ఆర్పారు. ఏం జరుగుతుందో తెలియని కూతురు శరీరం 80 శాతం కాలిపోయింది. తల్లి శరీరం 30 శాతం కాలింది. ఒంగోలు జీజీహెచ్ లో (Ongole GGH) చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి కుమార్తె ప్రియాంక మృతి చెందింది. కాలిన గాయాలతో తల్లి చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఒంగోలు మేజిస్ట్రేట్ బాధితుల ఇద్దరి వాంగ్మూలాలను నమోదు చేశారు.