COVID19 in AP: ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,515 కోవిడ్ కేసులు నమోదు మరియు 903 మంది రికవరీ, 15 వేలకు పెరిగిన ఆక్టివ్ కేసుల సంఖ్య
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,865 మంది శాంపుల్స్ను పరీక్షించగా 1,515 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఏపీలో 15,050 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.
Amaravathi, August 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా స్థిరంగా కొనసాగుతుంది. ఈ వారం ప్రారంభంలో వెయ్యికి పడిపోయిన రోజూవారీ కోవిడ్ కేసులు , వారాంతానికి వచ్చేసరికి 15 వందలకు పెరిగాయి. అయితే రికవరీల సంఖ్య తగ్గుతుండటం కొంత ఇబ్బంది కలిగించే విషయం, ఫలితంగా రోజురోజుకి ఆక్టివ్ కేసుల సంఖ్య చాపకింద నీరులా పెరుగుతూపోతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు సుమారు 2 కోట్ల మంది వ్యాక్సిన్ వేసుకోగా, అందులో 75 వేలకు పైగా రెండు డోసులు వేసుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇక, ప్రస్తుతం ఏపిలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులను ఒకసారి పరిశీలిస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,865 మంది శాంపుల్స్ను పరీక్షించగా 1,515 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 20,09,245కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 20,06,350 గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి జిల్లా నుంచి 223, నెల్లూరు నుంచి 202, చిత్తూరు జిల్లా నుంచి 199 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 10 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 13,788కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 903 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 19,80,407 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 15,050 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నివేదించింది.
(The above story first appeared on LatestLY on Aug 27, 2021 06:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

