AP's COVID Update: ఆంధ్రప్రదేశ్‌లో కల్లోలం, ఒక్కరోజులోనే రికార్డ్ స్థాయిలో  5 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 50 వేలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య
Coronavirus in India | Representational Image (Photo Credits: PTI)

Amaravati, July 19: ఆంధ్రప్రదేశ్‌లో  ఒకరోజును మించి ఒకరోజు కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఆదివారం కూడా  రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 5,041  మందికి  కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఒక్కరోజులో ఇంత పెద్ద మొత్తంలో కేసులు రావడం ఇదే తొలిసారి.  అయితే అందుకు తగినట్లుగా ఏపి సర్కార్ వైరస్ నిర్ధారణ పరీక్షలను కూడా భారీగా పెంచింది.  గత 24 గంటల్లో 31,148 మంది సాంపుల్స్ పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఏది ఏమైనా కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకరమే.

తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 49,650 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 46,755 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 56 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది.  పలు జిల్లాల నుంచి పదుల సంఖ్యలో కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 642 కు పెరిగింది.

AP's COVID Update:

status of positive cases of #COVID19 in Andhra Pradesh

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 1,106 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 22,890 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 26,118 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.