AP CM Delhi Tour: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం, రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రధాని మోదీతో చర్చించే అవకాశం, అరవింద్‌ కేజ్రీవాల్‌‌కు అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం
AP Chief Minister CM YS Jagan Mohan Reddy Delhi Tour Today | File Photo.

Amaravati, Febuary 12: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP Chief Minister CM YS Jagan Mohan Reddy) నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం జరగనుంది. ఆ సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ (AP CM Delhi Tour) బయలుదేరుతారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (PM Modi) కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ప్రధానమంత్రి దృష్టికి తెస్తారని అధికార వర్గాల సమాచారం.

ఈ సమావేశంలో అమరావతి (Amaravati) , మండలి రద్దుతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మోదీతో భేటీ అనంతరం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ (Amit Shah) జగన్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. రాష్ట్రానికి బడ్జెట్ లో కేటాయింపులు, రెవెన్యూ లోటుపై చర్చించే ఛాన్స్ ఉంది.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించి ప్రాజెక్టులకు తగిన కేటాయింపుల జరపని విషయాన్ని ప్రధాని దృష్టికి తేనున్నారు. అలాగే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పనతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను మరోసారి ప్రధానితో చర్చించనున్నట్టుగా సమాచారం.

అలాగే ఇటీవల ఏపీ అసెంబ్లీ దిశా చట్టం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంలో మార్పులు గురించి ఇప్పటికే కేంద్రం కొన్ని సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి దీని గురించి న్యాయపరంగా కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఢిల్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2020) ఘన విజయం సాధించిన ఆప్‌కి, ఆ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు (Kejriwal) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అలాగే కేజ్రీవాల్‌ పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.