JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డి కంపెనీకి రూ.100 కోట్ల జరిమానా, త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్దారించిన ఏపీ గనుల శాఖ, ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తునకు వెనుకాడబోమని వెల్లడి
JC Diwakar Reddy (Photo-Twitter)

Amaravati, Dec 1: తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి (JC Diwakar Reddy) భారీ షాక్ తగిలింది. ఆయనకు చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ (AP Mines Department) రూ.100 కోట్ల జరిమానా విధించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ జరిమానా కట్టకుంటే, ఆర్ అండ్ ఆర్ చట్టం (R and R Act) కింద ఆస్తుల జప్తునకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి.. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అ‍డ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లగా అధికారులు గుర్తించారు. ఇప్పటికే అక్రమ మైనింగ్‌తో పాటు జేసీ ట్రావెల్స్‌ నింబంధనల ఉల్లంఘనపై కూడా అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని అధికారులు ఇదివరకే ప్రకటించారు.

నిన్ను బజారుకీడ్చిన సంగతి గుర్తించుకో, నేను జస్ట్ ట్రయిల్ వేస్తేనే ఎంపీనయ్యాను, జేసీ దివాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్, పోలీసుల బూట్లు తుడిచి, ముద్దాడిన వైసీపీ ఎంపీ

జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్‌ మైనింగ్‌ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారని. అంతేకాకుండా అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారని సమాచారం. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.