Bifurcation Issues Row: కేంద్ర హోం శాఖతో ముగిసిన విభజన పంచాయితీ భేటీ, రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం
Ministry of Home Affairs. (Photo Credits: ANI)

Amaravati, Sep 27: విభజన సమస్యల పరిష్కారంపై (Bifurcation Issues Row) కేంద్ర హోంశాఖ సమావేశం (union home ministry) ముగిసింది. ఈ సమావేశంలో వివిధ అంశాలను ఏపీ, తెలంగాణ అధికారులు (Telangana Officials) ప్రస్తావించారు. ఈ సమావేశం సందర్భంగా ఎజెండాలో మొత్తం 14 అంశాలున్నాయి. వీటిలో 7 అంశాలు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి కాగా.. మరో ఏడు అంశాలు ఏపీకి సంబంధించినవి ఉన్నాయి.సమావేశం సందర్భంగా శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సు మేరకు రాజధాని నిర్మాణం కోసం రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.20వేల కోట్ల గ్రాంట్‌ ఇవ్వాలని తెలిపింది. షీలాబేడీ కమిటీ సిఫార్సుల ప్రకారం 89 సంస్థలను విభజించాలని సూచించింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో సెంట్రల్‌ అగ్రికల్చర్‌ వర్సిటీని ఏర్పాటు చేయాలని కోరింది.దీంతో పాటు రాష్ట్రంలో వెనుకబడిన 7 జిల్లాలకు నిధులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరగా.. ఐదేళ్లే ఇవ్వాలని నిర్ణయం జరిగిందని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

తిరుమల కొండపై రెండు రోజుల పాటు సీఎం జగన్, శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకోనున్న ఏపీ ముఖ్యమంత్రి

మరోవైపు షీలా బిడే కమిటీ సిఫార్సులపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటామని కేంద్రహోంశాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ కమిటీ సిఫార్సులను తెలంగాణ ఒప్పుకోవడం లేదన్నారు. తెలంగాణ అంగీకరించకపోయినా హోంశాఖ నిర్ణయం తీసుకోవచ్చు కదా? అని ఏపీ అధికారులు ప్రశ్నించగా.. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.

ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ సహా పలు సంస్థల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. పౌరసరఫరాల శాఖ బకాయిల అంకెల్లో తేడాలు ఉన్నాయని ఏపీ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్‌ బకాయిల అంశం చర్చకు రాలేదు. మరోసారి భేటీ కావాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది.

రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇవే..

- ప్రభుత్వ కంపెనీలు కార్పొరేషన్‌లో విభజన

- షెడ్యూల్-10లోని సంస్థల విభజన

- చట్టంలో లేని ఇతర సంస్థల విభజన

- ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన

- సింగరేణి కాలరీస్ ఏపీ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన

- బ్యాంకుల్లో ఉన్న నగదు, బ్యాలెన్స్ విభజన

- ఏపీఎస్సీఎల్, టీఎస్సీఎస్ఎల్ క్యాష్ క్రెడిట్, 2014-15 రైస్ సబ్సిడీ విడుదల.

ఏపీకి సంబంధించిన అంశాలు ఇవే..

- నూతన రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం

- ఏపీ విభజన చట్టం కింద పన్ను రాయితీలు

- ఏపీలోని ఏడు వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు

- పన్ను మదింపులో పొరపాట్ల సవరణ

- నూతన విద్యాసంస్థల ఏర్పాటు

- నూతన రాజధానిలో రాపిడ్ రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు.