BJP Prajagraha Sabha: 2024లో ఏపీలో బీజేపీదే అధికారం, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారు, విజయవాడ ప్రజాగ్రహ సభలో బీజేపీ నేతల సంచలన వ్యాఖ్యలు
BJP Prajagraha Sabha(Photo-Twitter/ AP BJP)

Amaravati, Dec 28: విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో (BJP Prajagraha Sabha) ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలని అన్నారు. హోదా అంశం నీతి ఆయోగ్ పరిధిలో ఉందని సోము వీర్రాజు (Somu Veerraju) స్పష్టం చేశారు.

ప్రస్తుతం కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులతో జగనన్న రైతు భరోసా కేంద్రాలే ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అదీ ఇదీ అని కాకుండా ఏపీలో అన్నింటినీ అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభ చూసి చాలామంది ఇబ్బందిపడుతున్నారని సోము వీర్రాజు అన్నారు.

మంత్రి పేర్నినానితో ముగిసిన సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల భేటీ, టికెట్ల విషయంలో హీరోలకు ఏం పని అంటూ నాని కౌంటర్

ఆస్తులు కూడబెట్టేందుకు ఈ నేతలు తాపత్రయపడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలకు (BJP Leaders) జైలు భయాలు లేవని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ నేతలు జైలుకు వెళ్లలేదని, భవిష్యత్తులోనూ వెళ్లబోరని స్పష్టం చేశారు. జగన్ కు ఏం చూపించాలో అది బీజేపీ చూపిస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బీజేపీ నిరాడంబరతకు మారుపేరు అని సోము వీర్రాజు అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన వామపక్ష నేతలపైనా ధ్వజమెత్తారు. వాళ్లు కమ్యూనిస్టులు కాదు... క్యాపిటలిస్టులు అంటూ మండిపడ్డారు. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులేనని ఆరోపించారు. పేద పిల్లల ఆహార నిధులను కూడా దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రేడింగ్ పార్టీల ఏజెంట్లుగా వామపక్షాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ సభలో (BJP Prajagraha Sabha in Vijayawada) ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్... ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ఆరోపించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయని వెల్లడించారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి కోసం అటవీభూములను బదిలీ చేశామని చెప్పారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో కొన్ని సమస్యలు గుర్తించానని అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని తెలిపారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.

ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని జవదేకర్ వ్యాఖ్యానించారు. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. అయోధ్యలో గొప్పగా రామాలయం నిర్మిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. కాగా, ప్రకాశ్ జవదేకర్ ఆంగ్లంలో ప్రసంగించగా, పురందేశ్వరి తెలుగులో అనువదించారు.