Kurnool Airport Inauguration: నెరవేరిన కర్నూలు జిల్లా వాసుల చిరకాల స్వప్నం, ఓర్వకల్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మార్చి 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
Kurnool / Orvakal Airport | Photo Credits: Twitter

Kurnool, March 25: కర్నూలు జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన స్వప్నం నేడు నిజరూపం దాల్చింది. కర్నూల్ ప్రజలకు ఓర్వకల్ నుంచే విమానయానం అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి గురువారం ఓర్వకల్ విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్ కూడా ఉన్నారు.

గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో  ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్, విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.  అనంతరం టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.  కర్నూల్ విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి విమానాశ్రయంగా సీఎం జగన్ నామకరణం చేశారు. ఈ విమానాశ్రయాన్ని సీఎం జగన్ జాతికి అంకితం చేశారు.

ఓర్వకల్ విమానాశ్రయాన్ని ఏపి ప్రభుత్వం సొంత ఖర్చుతో రూ. 110 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 6వ విమానాశ్రయం.

ఆర్‌సిఎస్ ఉడాన్ పథకం కింద ఇండిగో విమానయాన సంస్థ ఓర్వకల్ విమానాశ్రయం నుంచి తొలిదశలో బెంగళూరు, విశాఖపట్నం మరియు చెన్నై నగరాలకు రెండేళ్ల పాటు సర్వీసులు నడపటానికి ఒప్పందం కుదుర్చుకుంది. మార్చి 28 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతున్నాయి. తొలి విమానం మార్చి 28న ఉదయం 9.05 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు కర్నూలు చేరుకుంటుంది

షెడ్యూల్ ప్రకారం, ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9.05 గంటలకు బెంగళూరు నుండి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు కర్నూలు చేరుకుంటుంది, ఇదే ఫ్లైట్ అవే రోజుల్లో మధ్యాహ్నం 3.15 గంటలకు కర్నూలు నుండి బయలుదేరి సాయంత్రం 4.25 గంటలకు రిటర్న్ బెంగళూరు చేరుకుంటుంది.

మరో మార్గంలో, ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం మరియు ఆదివారం ఉదయం 10.30 గంటలకు కర్నూలు నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అదే రోజు మధ్యాహ్నం 1 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.55 గంటలకు కర్నూలు చేరుకుంటుంది.

చెన్నై సెంట్రల్ వైపు విమానాలు మంగళవారం, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు కర్నూలు చేరుకుంటాయి, అదే రోజున రైలు కర్నూలు నుండి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు చెన్నై చేరుకుంటుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు