Early Elections Row: ఏపీలో ముందస్తు ఎన్నికలు, క్లారిటీ ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం
Sajjala Ramakrishna Reddy (Photo-Twitter)

Tadepalli, July 6: ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తి లేదని సజ్జల స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదు అని క్లియర్‌ కట్‌గా చెప్పారు. ముందుస్తు ఎన్నికల పేరుతో కొన్ని మీడియా ఛానెళ్లు హడావుడి చేస్తున్నాయని అన్నారు.

కాగా, సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న సురక్ష కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటాం. మళ్లీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతీ ఎమ్మెల్యేకు ప్రజలు ఇదే చెబుతున్నారు. సీఎం జగన్‌ పూర్తిగా పాజిటివ్‌ ఓటునే నమ్ముకున్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాసే మీడియా ఛానెల్స్‌ హడావుడి ఇది. ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దు.

మళ్లీ జగన్ సర్కారుదే అధికారం, నవరత్నాలే కారణం, సినీ నటుడు సుమన్ ఆసక్తిర వ్యాఖ్యలు

చంద్రబాబు అలిపిరి ఘటనను అడ్డం పెట్టుకోవాల్సిన పని మాకు లేదు. ఆ పేరుతో చంద్రబాబు తన పార్టీని బతికించుకోవాలని చూస్తున్నారు. ముందస్తుపై ఎల్లోమీడియాలో రాసుకుని మమ్మల్ని వివరణ అడిగితే ఎలా?. ముందస్తు అనేది చంద్రబాబు చేసే గేమ్ ప్లాన్ మాత్రమే. పవన్‌తో ఐదో, ఆరు సీట్ల గురించి చర్చించుకునేందుకు ప్రచారం చేసుకుంటున్నారు. ఊగిసలాడే వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు, పవన్ ఆడే గేన్ ప్లాన్ ఇది. ఒక రకంగా ఇది జనాన్ని మోసం చేయటమే.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా అందుతున్నాయి. అందుకే ప్రజలు కూడా మాపై పాజిటివ్‌గా ఉన్నారు. అందుకే నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అమరావతిలో పేదలకు ఇళ్లు రాకూడదని టీడీపీ కోరుకుంటోంది. రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా?. బీజేపీ ఎవరిని అధ్యక్షుడిగా పెట్టుకుంటుందో అది వారి ఇష్టం. వారితో మాకేం పని?. మీడియా చేసే ప్రచారాలతో మాకు సంబంధం ఏం ఉంది? అని ప్రశ్నించారు.