Krishna Water Dispute: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను తక్షణమే అప్పగించండి, రెండు తెలుగు రాష్ట్రాలకు లేఖలు రాసిన కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్రప్రతాప్సింగ్, వీటితో పాటు నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను తమకు అప్పగించాలని లేఖలో వెల్లడి
ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లతోపాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను (అవుట్లెట్లు) తక్షణమే అప్పగించాలని తెలుగు రాష్ట్రాలను (andhra pradesh telangana principal secretaries) కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్రప్రతాప్సింగ్ ఆదేశించారు.
Amaravati, Nov 8: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లతోపాటు వాటి నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను (అవుట్లెట్లు) తక్షణమే అప్పగించాలని తెలుగు రాష్ట్రాలను (andhra pradesh telangana principal secretaries) కృష్ణా బోర్డు చైర్మన్ మహేంద్రప్రతాప్సింగ్ ఆదేశించారు. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకునే అంశంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తాజాగా కేఆర్ఎంబీ చైర్మన్ లేఖ (KRMB chairman writes letter) రాశారు.
ఈ లేఖలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను (Srisailm and sagar Projects ) తక్షణమే అప్పగించాలని కేఆర్ఎంబీ చైర్మన్ కోరారు. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ జూలై 15న గెజిట్ నోటిఫికేసన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గెజిట్ను అక్టోబర్ 14వ తేదీ నుంచే అమలు చేయాల్సి ఉంది. కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో.. దీనిపై ఆలస్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ మహేంద్ర ప్రతాప్ సింగ్ ఇరు రాష్ట్రాల సీఎస్లకు లేఖలు రాశారు. గత నెల 12న జరిగిన బోర్డు సమావేశంలో శ్రీశైలం, సాగర్లతో గెజిట్ నోటిఫికేషన్ అమలును ప్రారంభించడానికి 2 రాష్ట్రాలు అంగీకరించాయని లేఖలో గుర్తు చేశారు.
గెజిట్ నోటిఫికేషన్ అమలు కోసం రెండు రాష్ట్రాల జలవనరుల శాఖల అధికారులు, జెన్కో అధికారులతో పలుదఫాలు చర్చలు జరిపామని, సబ్ కమిటీలను ఏర్పాటు చేశామని లేఖలో ప్రస్తావించారు. నోటిఫికేషన్ ప్రకారం షెడ్యూల్–2లో పొందుపరిచిన ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తీసుకుని నిర్వహించాలన్నారు. షెడ్యూల్–3లో ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలన్నారు. బోర్డు నిర్వహణ కోసం సీడ్ మనీ కింద ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున కృష్ణా బోర్డు ఖాతాలో జమ చేయాలని సూచించారు.
ఇదిలా ఉంటే శ్రీశైలం స్పిల్ వే, కుడి గట్టు విద్యుత్ కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ-నీవా (మల్యాల, ముచ్చుమర్రి పంప్ హౌస్), సాగర్ కుడి కాలువ విద్యుత్ కేంద్రాలను బోర్డుకు అప్పగిస్తూ గత నెల 14వ తేదీనే ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల, సాగర్ స్పిల్ వే, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎఎమ్మార్పీ, సాగర్ వరద కాలువ, సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, విద్యుత్ కేంద్రం, సాగర్ కుడి కాలువలను తెలంగాణ సర్కార్ నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడే తమ ప్రాజెక్టులను అధీనంలోకి తీసుకోవాలని షరతు విధించింది.
దీంతో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు సందిగ్ధంలో పడింది. ఇక తెలంగాణలో ఉన్న 9 అవుట్ లెట్లను బోర్డుకు స్వాధీనం చేయడంపై కేసీఆర్ సర్కార్ ఇంకా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే.. స్పందించిన కేఆర్ఎంబీ.. నోటిఫికేషన్ అమలుకు వీలుగా తక్షణమే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తూ రెండు రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. వాటి కార్యాలయాలు, సిబ్బందిని, వాహనాలను కూడా బోర్డుకు అప్పగించాలని కేఆర్ఎంబీ చైర్మన్ లేఖలో పేర్కొన్నారు.
కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ ఒక డ్రామాగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే తెలంగాణకు జల కేటాయింపుల అంశాన్ని తక్షణమే ట్రిబ్యునల్కు రిఫర్ చేయాలన్నారు. సెక్షన్ సి కింద కేంద్రం ఎందుకు రిఫర్ చేయట్లేదని ఆయన ప్రశ్నించారు.
(The above story first appeared on LatestLY on Nov 08, 2021 12:44 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

