AP Municipal Polls 2021: సమావేశం నుంచి టీడీపీ నేత వర్ల రామయ్యని బయటకు పంపించిన ఎస్ఈసీ, అఖిలపక్ష నేతలతో ముగిసిన నిమ్మగడ్డ భేటీ, మునిసిపల్ ఎన్నికలకు అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు
AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, Mar 1: త్వరలో జరగనున్న ఏపీ మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై (AP Municipal Polls 2021) అఖిలపక్ష నేతలతో ఎస్‌ఈసీ చర్చించారు.

వైఎస్సార్‌ సీపీ నుంచి అధికార ప్రతినిధి నారాయణమూర్తి, పద్మజారెడ్డి.. టీడీపీ నుంచి వర్ల రామయ్య, సీపీఐ నుంచి విల్సన్.. కాంగ్రెస్ నుంచి మస్తాన్‌వలి, సీపీఎం నుంచి వైవీ రావు హాజరయ్యారు. రాజకీయ పార్టీల విజ్ఞప్తులను పరిశీలిస్తామని, ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు పాటించాలని ఎస్‌ఈసీ కోరారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక అఖిలపక్ష భేటీలో టీడీపీ నేత వర్ల రామయ్యను ఎస్‌ఈసీ బయటకు పంపివేశారు. సమావేశంలో అడుగడుగునా ఎస్‌ఈసీ మాటలకు అడ్డుపడటంపై నిమ్మగడ్డ (SEC Nimmagadda Ramesh Kumar) అసహనం వ్యక్తం చేశారు. పలుమార్లు హెచ్చరించినా వర్ల రామయ్య పట్టించుకోలేకపోవడంతో విధిలేక ఆయనను సమావేశం నుంచి బయటకు పంపించారు. బయటకు వచ్చిన వర్ల రామయ్య.. గతంలో ఉన్నట్లు ఎస్‌ఈసీ లేరంటూ ఆరోపణలు చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు, మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ ఉల్లంఘించిన జేసీ ప్రభాకర్‌రెడ్డి, క్రికెట్‌ కిట్లను పంపిణీ చేస్తూ పట్టుబడిన వైనం

ఎస్‌ఈసీతో భేటీ అనంతరం​ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా వ్యవహరించొద్దని ఎస్‌ఈసీకి సూచించామని పేర్కొన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్‌ చేసుకోవద్దని సూచించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్‌ చేసుకుంటామనే రీతిలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు.

మార్చి 10వ తేదీ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించండి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, గవర్నర్‌ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్, మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై టీడీపీ చేస్తోన్న దాడులను కంట్రోల్ చేయాలని ఎస్‌ఈసీని కోరామని చెప్పారు. రేణిగుంట ఎయిర్‌పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న చంద్రబాబుపై ఎస్‌ఈసీనే కేసు నమోదు చేయాలని కోరామని నారాయణ మూర్తి తెలిపారు.

ఇదిలా ఉంటే సమావేశంలో వాలంటీర్లపై నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీకి అనుకూలంగా వాలంటీర్లు పని చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం, నిమ్మగడ్డ కీలక ఆదేశాలను జారీ చేశారు. ఈ ఎన్నికల్లో వాలంటీర్లను వినియోగించుకోరాదని ఆయన ఆదేశించారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని, వారి కదలికలపై దృష్టి సారించాలని చెప్పారు. ఎన్నికల సమయంలో ఓటర్లను వాలంటీర్లు ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాలంటీర్ల చేత ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేయించవద్దని చెప్పారు.

నిమ్మగడ్డ రమేశ్ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తనదైన శైలిలో స్పందించింది. ఆయన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మధ్యాహ్నం పిటిషన్ పై హైకోర్టు విచారణ జరపనుంది.