Swarna Palace Fire Accident: స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం, రమేష్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు, కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే ఎవరికైనా నోటీసులు ఇస్తామని తెలిపిన ఏసీపీ సూర్యచంద్రరావు
Swarna Palace Fire Accident (Photo-ANI)

Vijayawada, August 18: ఏపీలో విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద దుర్ఘటనకు (Swarna Palace Fire Accident) సంబంధించి గవర్నర్‌పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రమేష్‌ కార్డియాక్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పోతినేని రమేష్‌బాబు (Dr. P. Ramesh Babu) ఆగస్టు 17న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అగ్నిప్రమాదంలో కరోనా రోగులు మృతి చెందిన ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. స్వర్ణ ప్యాలెస్‌లో కోవిడ్‌ రోగులకు చికిత్స చేసేందుకు జిల్లా వైద్యాధికారి అనుమతి ఇచ్చారని తెలిపారు.

ఈ కేసులో పోలీసులు తనను అరెస్ట్‌ చేస్తే తన పరువు పోతుందని, ఆసుపత్రి (Ramesh Hospitals) ప్రతిష్ట దెబ్బతింటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే ఇదే అభ్యర్థనతో రమేశ్‌ కార్డియాక్‌ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్‌ ఎం.సీతారామమోహనరావు కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఆగస్టు 18న హైకోర్టు విచారణ జరపనుంది.

ఇదిలా ఉంటే తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయమని కోరుతూ రమేష్‌ హాస్పిటల్స్‌ అధినేత డాక్టర్‌ రమేష్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తూ ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఏపీపీ కౌంటర్‌ దాఖలు నిమిత్తం వాయిదా వేశారు. ప్రమాదం ఎలా జరిగింది? విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు, 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు, మృతుల కుటుంబాలకు కేంద్రం నుంచి రూ. 2 లక్షలు, రాష్ట్రం నుంచి రూ. 50 లక్షలు

గవర్నర్‌పేట పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేనందున ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని డాక్టర్‌ రమేష్‌బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రమేష్‌ హాస్పిటల్స్‌ యాజమాన్యం, హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌ యాజమాన్యాన్ని ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. కాగా స్వర్ణ ప్యాలెస్‌లో రమేష్ ఆసుపత్రి ఏర్పాటు చేసిన కోవిడ్‌ సెంటర్‌ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా అగ్నిప్రమాదం జరిగి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ఈ కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే ఎలాంటివారైనా నోటీసులు ఇవ్వడానికి వెనుకాడబోమని ఏసీపీ సూర్యచంద్రరావు పేర్కొన్నారు. రమేశ్‌ ఆసుపత్రి యాజమాన్య వ్యవహారంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నాం. ఇప్పటి వరకు డాక్టరు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్‌కి కూడా నోటీసులిస్తాం. రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాలి. వృద్దాప్యంలో ఉన్నవారు విచారణకు రాలేకపోతే ఇంటికికే వెళ్లి విచారిస్తాం..మిగిలిన వారు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుందని అన్నారు.

రమేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు. పరారీలో ఉండి దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదు. నేడు 91 సీఆర్‌పీసీ కింద ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని నోటీసు ఇస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే ఎంవోయూ చేసుకున్నారో మాకు తెలియజేయాలని కోరారు.

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారో చూపించాలి. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు మాకు చూపించలేదు. దీనిపై ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది. క్వారంటెన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు.. ఎవరి అభప్రాయాలు వారికి ఉంటాయి. విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా నోటీసులు ఇస్తామని ఏసీపీ వెల్లడించారు.