Rajamandri Gang Rape Case: బాలికకు మత్తు మందు ఇచ్చి ఏడు మంది గ్యాంగ్ రేప్, 12మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుల్లో ఇద్దరికీ కరోనా పాజిటివ్
Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Amaravati, July 22: దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠిన శిక్షలు అమలు చేస్తున్నా ఆడపిలలకు రక్షణ లేకుండా పోతుంది. ఇక ఏపీలో దిశ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలానికి చెందిన బాలికపై సామూహిక అత్యాచారం ఘటన (Rajamandri Gang Rape Case) ఇందుకు ప్రత్యక్ష్య సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ఘటనపై ఏపీలో ఇప్పుడు నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. అసలేం జరిగింది? దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లో శిరోముండనం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం, ఎస్సై,ఇద్దరు కానిస్టేబుల్స్ సస్పెండ్

ఘటన పూర్వాపరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ముగ్గురు కూతుళ్లు. భర్త చాలా సంవత్సరాల కిందటే చనిపోయాడు. ముగ్గురు కూతుళ్లలో రెండో కూతురు పదో తరగతి వరకు చదువుకుంది. రాజమహేంద్రవరంలోని (Rajahmundry) ఓ దుకాణంలో పని ఇప్పిస్తానంటూ అనిత అనే స్థానిక మహిళ ఈనెల 12న ఆమెను తీసుకెళ్లింది. అయితే అప్పటికే అనిత మత్తుమందుకు అలవాటు పడింది. దీంతో పాటుగా క్వారీ మార్కెట్ ప్రాంతానికి చెందిన బ్లేడు బ్యాచ్ యువకులతో ఆమెకు పరిచయం ఉంది.

ఈ క్రమంలోనే బాలికను తీసుకెళ్లి ఆ బ్లేడు బ్యాచ్ యువకులకు అనిత అప్పగించింది . ముందస్తు ప్రణాళిక ప్రకారమే రాజమహేంద్రవరం గోకవరం బస్టాండు దగ్గర ఓ గదికి బాలికను ఆమె తీసుకెళ్లింది. ఆ బ్యాచ్‌లోని యువకులు బాలికకు మత్తుమందు ఇచ్చారు. తర్వాత బాలికను గదిలో బంధించి నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి (Rajahmundry Minor Girl Incident) పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా చిత్రహింసలు పెట్టారు. జూలై 12న సాయంత్రం ఇంటికి అనిత మాత్రమే తిరిగి వచ్చింది. దీంతో తన కూతురు ఏదని ఆమె తల్లి అడిగింది. తనకు తెలియదని అనిత బదులివ్వడంతో బాలిక తల్లి కోరుకొండ పోలీసు స్టేషన్‌లో (Korukonada Police Station) ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు 16వ తేదీ రాత్రి బాలికను అపస్మారక స్థితిలో చూశారు. వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక కోలుకున్నాక జరిగిన విషయమంతా వివరించింది. అత్యాచారానికి పాల్పడిన ఏడుగురు నిందితులతో పాటు మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి ఇందులో ఎంత మంది నిందితులు ఉన్నారనే విషయాన్ని తేల్చుతామని పోలీసులు తెలిపారు .

నిందితులపై కిడ్నాప్, రేప్ కేసులతో పాటు పోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో అనితతో పాటు మొత్తం 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నిందితుల్లో నలుగురు ఆటో డ్రైవర్లతో మిగతా పనులు చేసుకుంటున్నవారు ఉన్నారు. ఓ మైనర్ బాలుడు కూడా ఉండడం గమనార్హం. నిందితులకు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు చేయగా  ఇద్దరికి పాజిటివ్ రావడంతో అంతా షాకయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయడంతో ఈ ఘటనలో కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. తాజాగా బాలికపై అఘాయిత్యం వెనుక ఆమెకు అక్క వరసయ్యే మచ్చా అనిత ప్రధాన కుట్రదారుగా వ్యవహరించారని రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్పాయ్ తెలిపారు.

ఈఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించారు. దిశ చట్టం చేసేశామని కోట్ల ప్రజాధనంతో ప్రచారం చేసుకున్న ప్రభుత్వం... అమలులో ఆ చట్టానికి దిక్కు లేకుండా చేసింది. మహిళలకు రక్షణ కల్పించాలన్న చిత్తశుద్ధి, నిబద్దత ప్రభుత్వానికి ఉంటే ఈ వరుస అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

Here's Chandra Babu Naidu Tweet

రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల బాలికపై బ్లేడ్ బ్యాచ్‌ ముఠా చేసిన అరాచకంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ గ్యాంగ్ రేప్ అమానుషం అన్న ఆయన ఇది తమను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. నాలుగు రోజులపాటూ చిత్ర హింసలు పెట్టిన ఆ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కూతురు కనిపించట్లేదని తల్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినా వెంటనే స్పందించట్లేదని తెలిసిందన్న పవన్ కళ్యాణ్ దిశ చట్టం ఏమైందని ప్రశ్నించారు.

లైంగిక దాడికి గురైన రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన బాలికను ఆదుకుంటామని ఎమ్మెల్యే, కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజా పేర్కొన్నారు. అత్యాచారానికి గురై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీతో కలసి పరామర్శించారు. బాలిక కుటుంబ సభ్యులను ఓదార్చి, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళల భద్రత కోసం దిశ చట్టం రూపొందించారని తెలిపారు. మైనర్‌ బాలికపై జరిగిన సంఘటనపై స్పందించి నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించామన్నారు.