Amaravati, July12: ఆంధ్రప్రదేశ్లో మరోసారి రికార్డ్ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా మరో 1933 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 29,168 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 26,336 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 17,624 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో గడిచిన ఒక్కరోజులోనే కొత్తగా మరో 19 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 328 కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 846 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 15,412 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 13,428 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
AP COVID19 Report:
ఇక ఇప్పటికే వైరస్ నిర్ధారణ పరీక్షల్లో ముందున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మరో ముందడుగు వేసింది.
#COVID19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి 20 మొబైల్ శాంపిల్ సేకరణా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఒకే సారి 10 కౌంటర్లలో శాంపిల్ సేకరించే విధంగా ఈ మొబైల్ యూనిట్స్ తయారు చేయబడ్డాయి. త్వరలో మరో 50 మొబైల్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.