AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో విస్తరిస్తోన్న కరోనా మహమ్మారి, కొత్తగా మరో 246 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1900 దాటిన కోవిడ్19 ఆక్టివ్ కేసుల సంఖ్య
Representational Image (Photo Credits: PTI)

Amaravati, March 19: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కేసులు కొద్దిరోజులుగా కనీసం 200కు తక్కువ కాకుండా నమోదవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు సరిహద్దును పంచుకొనే చిత్తూరు జిల్లా నుంచి ఎక్కువ కేసులు వస్తుండగా, ఈ జిల్లా నుంచి వైరస్ రాష్ట్రంలోని మరిన్ని జిల్లాలకు విస్తరిస్తోంది. అంతేకాకుండా ప్రజలు కోవిడ్ నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసి మాస్కులు లేకుండా యదేచ్ఛగా తిరుగుతుండటం కూడా రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తికి కారణమవుతోంది.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,546 మంది శాంపుల్స్ ను పరీక్షించగా  246 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 8,92,986 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,90,091గా ఉంది.

గడిచిన ఒక్కరోజులో గుంటూరు జిల్లా నుంచి అత్యధికంగా 58 కోవిడ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు నుంచి 45,  కృష్ణా నుంచి 37 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో ప్రకాశం జిల్లాలో కోవిడ్ కారణంగా ఒకరు మరణించారు, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7,187కు పెరిగింది.

మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 131 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,83,890 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1909 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.