Hyderabad/ Amaravathi, May 13: తెలుగు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంగా 5 వేలకు మించకుండా కేసులు నమోదవుతుండగా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22 వేల పైబడి కేసులు నమోదవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో ఫీవర్ సర్వే కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు వారి వారి వ్యూహాల ప్రకారం కోవిడ్ నివారణకు ప్రయత్నిస్తున్నాయి. రాబోయే కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు ఎలాంటి సత్ఫలితాలను ఇస్తాయో చూడాలి.
ముందుగా తెలంగాణ రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే.. నిన్న రాత్రి 8 గంటల వరకు 71,221 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 4,693 మందికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 2474 మంది శాంపుల్స్కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 5,16,404కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 734 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 285 కేసులు, రంగారెడ్డి నుంచి 296 మరియు నల్గొండ జిల్లా నుంచి 296 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:
గడిచిన 24 గంటల్లో మరో 33 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 2,867కు పెరిగింది.
అలాగే నిన్న సాయంత్రం వరకు మరో 6,876 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 4,56,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,917 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 22,399 కోవిడ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్లో కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 96,446 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 22,399 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 13,66,785కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 13,63,890గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో తూర్పు గోదావరి నుంచి అత్యధికంగా 3,372 కోవిడ్ కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లా నుంచి 2,646, గుంటూరు నుంచి 2,141, విశాఖపట్నం నుంచి 2,064 కేసుల చొప్పున నమోదయ్యాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Bulletin:
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మరో 89 కోవిడ్ మరణాలు సంభవించాయి, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 9,077కు పెరిగింది.
మరోవైపు, నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 18,638 మంది బాధితులు కోవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 11,56,666 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 2,01,042 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.