Covid Impact on TS Revenue: కేంద్రంపై సీఎం కేసీఆర్ సీరియస్, కరోనా దెబ్బకు తెలంగాణ కోల్పోయిన ఆదాయం రూ.52,750 కోట్లు, వరదలతో అనేక రంగాలకు తీవ్ర నష్టం, కేంద్రం వైఖరి తేటతెల్లమైందని తెలిపిన తెలంగాణ సీఎం
Telangana CM KCR | Photo: CMO

Hyd, Nov 8: కరోనావైరస్ మహమ్మారి తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి (Covid Impact in TS) భారీగా గండి కొట్టింది. కోవిడ్, లాక్‌డౌన్‌ ప్రభావం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ.52,750 కోట్ల మేర తగ్గనున్నదని (Telangana estimates Rs 52,750 crore revenue loss) ఆర్థికశాఖ అధికారులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వెల్లడించారు.

రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య ఏడు నెలల్లో రూ.39,608 కోట్లు ఆదాయం వచ్చిందని.. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు రూ.33,704 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతిభవన్‌లో (Pragati Bhavan) ఆర్థికశాఖ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు.

వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి 2020–21 బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. ఆశించిన 15 శాతం వృద్ధి లేకపోగా.. కరోనా వల్ల గత ఏడాది వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాలేదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నులు, పన్నేతర మార్గాల ద్వారా మొత్తం రూ.1,15,900 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాతో బడ్జెట్‌ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరాంతానికి కేవలం రూ.68,781 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరే అవకాశాలున్నాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం రూ.47,119 కోట్లు తగ్గనుందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.

తెలంగాణలో తాజాగా 1,440 మందికి కరోనా, ఐదుగురు మృతితో 1377కి చేరిన మరణాల సంఖ్య

కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గిందని ఆర్థిక శాఖ అధికారులు సీఎం కేసీఆర్‌కు (CM KCR) వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ర్టానికి రూ.16,727 కోట్లను పన్నుల్లో వాటాగా చెల్లిస్తామని కేంద్రం బడ్జెట్‌లో పేర్కొన్నదని చెప్పారు. ఆ మేరకు ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య వాటాగా రూ.8,363 కోట్లు రావాల్సి ఉన్నదని, కానీ.. రూ.6,339 కోట్లు మాత్రమే వచ్చాయని వివరించారు. పన్నుల్లో వాటా ఇప్పటికే రూ.2,025 కోట్లు తగ్గినట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.16,727 కోట్లకు గాను రూ.11,898 కోట్లు మాత్రమే వాటాగా వచ్చే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఫలితంగా రాష్ర్టానికి మరో రూ.4,829 కోట్ల నష్టం కలుగుతుందని తెలిపారు.

మళ్లీ విరుచుకుపడిన వానదేవుడు, జల రక్కసితో వణికిన హైదరాబాద్‌

దీంతో పాటు ఈ ఏడాది వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద ఈ ఏడాది రాష్ట్రానికి రూ.9,725 కోట్లు రావాల్సి ఉన్నదని చెప్పారు. దీని ప్రకారం అక్టోబర్‌ వరకు రూ.5,673 కోట్లు రావాల్సి ఉండగా, రూ.4,592 కోట్లు మాత్రమే వచ్చాయని, రూ.1,081 కోట్లు తగ్గాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ.8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని, మొత్తంగా రూ.802 కోట్లు కోత పడే అవకాశం ఉన్నదని వివరించారు. ఈ నేపథ్యంలో 2020-21 బడ్జెట్‌ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని సూచించారు.

హైదరాబాద్ వరద బాధితులకు తమిళ నాడు సీఎం రూ. 10 కోట్లు విరాళం

దీనిపై సీఎం కేసీఆర్‌ స్పందిస్తూ.. రాష్ట్రానికి మొత్తంగా రూ.52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షిస్తుండగా కేంద్ర ప్రభుత్వ వరద సాయం అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇటీవలి వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో భారీగా ఆస్తి, పంట నష్టం జరిగినా కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సాయం అందించకపోవడం దారుణమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు నష్టం కలిగితే కనీసం స్పందించలేదని విచారం వ్యక్తంచేశారు.

ఇటీవలి వర్షాలతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తాయన్నారు. దీంతో అనేక రంగాలకు తీవ్ర నష్టం కలిగిందని, రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టం జరిగిందని అధికారులు సీఎంకు చెప్పారు. ప్రాథమికంగా దాదాపు రూ.5 వేల కోట్ల వరకు నష్టం కలిగినట్టు అంచనా వేశామని తెలిపారు. తక్షణసాయంగా రూ.1,350 కోట్లను అందించాలని సీఎం కేసీఆర్‌ అక్టోబర్‌ 15న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారని గుర్తుచేశారు. వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారన్నారు.

వారు సీఎం కేసీఆర్‌తో స్వయంగా మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారని చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి, పరిస్థితిని స్వయంగా చూసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎంతో కొంత సాయం అందుతుందని ఆశించామని, కానీ కేంద్రం ఒక్క రూపాయి కూడా అందించలేదని వివరించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల వల్ల భారీగా పంట నష్టం, ఆస్తి నష్టం జరిగినా సాయం అందించకపోవడం కేంద్రం వైఖరిని తేటతెల్లం చేస్తున్నదని విమర్శించారు.

సమావేశంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్‌ రోస్‌ తదితరులు పాల్గొన్నారు.