Telangana: తెలంగాణలో 500కు చేరువైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయటంపై నిషేధం విధింపు
COVID-19 in Telangana | (Photo Credits: IANS)

Hyderabad, April 9: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు (COVID-19 in Telangana) రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి.  కొత్తగా మరో 49 కరోనావైరస్ పాజిటివ్ కేసులను ఆరోగ్య అధికారులు బుధవారం నిర్ధారించారు. ఈ కొత్త కేసులతో గురువారం ఉదయం నాటికి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 453 కు పెరిగింది. అయితే అందులో 45 మంది కోలుకొని, డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 మంది కోవిడ్-19తో మరణించారు. ప్రస్తుతం, తెలంగాణలో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 397 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కోవిడ్-19 పేషెంట్లందరికీ గాంధీ ఆసుపత్రిలోనే (Gandhi Hospital)  చికిత్స అందిస్తున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంధర్ (HM Eteal Rajender) తెలిపారు. ప్రస్తుతం కొంతమంది పేషెంట్లు కింగ్ కోఠిలోని ఏరియా ఆసుపత్రి మరియు ఫీవర్ ఆసుపత్రుల్లో ఉన్నారు, వీరు డిశ్చార్జ్ అయిన తర్వాత కొత్తగా నమోదయ్యే పేషెంట్లందరికి చికిత్స కోసం గాంధీకే తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇక నిత్యం కరోనావైరస్ తో పోరాడే వైద్య, ఆరోగ్య సిబ్బంది రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఐదు లక్షల వ్యక్తిగత రక్షణ సామగ్రి (పిపిఇ), మరో ఐదు లక్షల ఎన్ 95 మాస్క్‌ల కోసం ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు మరియు నర్సుల కోసం రెండు కోట్ల సర్జికల్ మాస్క్‌లు, ఒక కోటి మెడికల్ గ్లౌజులు కొనుగోలు చేస్తున్నామని, 3.5 లక్షల కరోనావైరస్ టెస్టింగ్ కిట్లు, ఐదు లక్షల స్పెషల్ సేఫ్టీ ఐ-గ్లాసెస్ కోసం ఆర్డర్లు ఉంచామని మంత్రి ఈటల తెలిపారు.

దిల్లీ మర్కజ్ వెళ్లిన వారి నుంచే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్రం నుంచి దిల్లీ వెళ్లి వచ్చిన సుమారు 1100 మంది అందరినీ ఇప్పటికే గుర్తించామని, వారితో పాటుగా వారి కుటుంబ సభ్యులను 3158 మందిని ఏప్రిల్ 21 వరకు క్వారైంటైన్లో ఉంచినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కోవిడ్-19 కేసులను సింగిల్ డిజిట్‌కు తీసుకువస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌనే శరణ్యం అని చెబుతున్న సీఎం కేసీఆర్

మరోవైపు, ఉమ్మివేయడం ద్వారా కూడా కోవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)  ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాలలో (Public Places) ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ (Spitting Ban) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేస్తే రూ. 500 జరిమానాతో పాటు, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.