Schools Reopen in TS: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల కోసం విద్యాసంస్థలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
Telangana CM KCR | File Photo

Hyderabad, August 23: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు తెరుచుకోబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు సహా అంగన్ వాడీ కేంద్రాలను వచ్చే నెల నుంచే పున:ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆగస్టు 30 లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలు మరియు హాస్టళ్లను శానిటైజ్ చేసి ప్రత్యక్ష తరగతుల కోసం సిద్ధం చేయాలని పంచాయితీ రాజ్ మరియు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. రాష్ట్రంలో 2020 మార్చి నుంచి కేవలం ఆన్‌లైన్ లోనే బోధన కొనసాగుతూవస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తగ్గుముఖంపట్టింది, ఈ నేపథ్యంలో  పాఠశాలల పున:ప్రారంభంపై సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ స్కూళ్లు తెరవడంపై నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలను తిరిగి తెరవాలనే ప్రభుత్వ నిర్ణయానికి దారితీసిన అంశాల గురించి ముఖ్యమంత్రి వివరించారు.

సీఎం మాట్లాడుతూ.. ‘‘కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ ఇబ్బందుల్లో పడింది. విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సహా ప్రైవేట్ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షుణ్ణంగా చర్చించాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో చర్చించాం. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వారు నివేదికలు అందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నది. అదే సందర్భంలో విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్థినీ, విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక వత్తిడి పెరిగుతున్నదని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉన్నదనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కేజి నుంచి పీజీ దాకా, ప్రభుత్వ, ప్రైవేట్  విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని రకాల పూర్వాపరాలు పరిశీలించిన మీదట, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకుని, పలు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి పున:ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.’’ అని సీఎం తెలపారు.

విద్యార్థుల పట్ల జాగ్రత్తలు:

విద్యాసంస్థలు తెరిచిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లల్లోని విద్యార్థినీ, విద్యార్థులకు జ్వర సూచన ఉంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని పిహెచ్‌సీకి తీసుకువెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం తెలిపారు. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయితే సదరు విద్యార్థినీ, విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సీఎం సూచించారు.  తరగతికి హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణా చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను సీఎం కోరారు.

పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలదే బాధ్యత:

ఇన్నాళ్లు పాఠశాలలు మూతబడి ఉండడం మూలానా, గ్రామాలు పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పాఠశాలలు, విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్ లదేనని సీఎం పునరుద్ఘాటించారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో టాయిలెట్స్ సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి సానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను సీఎం ఆదేశించారు.

ఇందుకుగాను జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు సానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా ఉన్నాయో లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డిపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డిపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ధారించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.