TS Coronavirus: నిజామాబాద్‌లో కరోనా విశ్వరూపం, పెళ్లి వేడుకకు వెళ్లిన 86 మందికి కరోనా పాజిటివ్, షాపింగ్‌ మాల్‌లో 75 మందికి కోవిడ్ నిర్ధారణ, 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్, అప్రమత్తమైన అధికారులు
Coronavirus outbreak | (Photo Credits: IANS)

Hyderabad, April 4: తెలంగాణలో నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో పెళ్లి వేడుకల్లో కరోనా కలకలం (Coronvirus in Nizamabad) సృష్టించింది. గత గురువారం పెళ్లికి హాజరైన 86 మందికి కరోనా పాజిటివ్‌గా (coronavirus positive) నిర్థారణ అయ్యింది. సిద్దాపూర్‌లో మూడు రోజులుగా పరీక్షల శిబిరం కొనసాగుతోంది. ఇప్పటివరకు 370 మందికి టెస్టులు చేయగా, 86 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల్లో 865 మంది కరోనా బారినపడ్డారు. అప్రమత్తమైన ప్రభుత్వం.. క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది.

ఇక నగరంలోని బస్‌స్టాండ్ ‌సమీపంలో గల ఓ షాపింగ్‌ మాల్స్‌లో ఆరోగ్యశాఖ వైద్య సిబ్బంది రెండు రోజులపాటు సుమారు 190 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా మొత్తం 75 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా శనివారం వినాయక్‌నగర్‌లోని ఓ వ్యాపార సముదాయంలో 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు సముదాయాల్లోనే 89 మందికి కోవిడ్‌ సోకినట్లు తేలింది. కాగా ప్రతి వ్యాపార సముదాయంలో ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని ఆరోగ్య సిబ్బందిని అధికారులు ఆదేశించారు. దీంతో కొన్ని రోజులుగా నగరంలోని షాపింగ్‌ మాల్స్‌లో టెస్టులు నిర్వహిస్తున్నారు. దీంతో వీటిలో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణలో కరోనా కల్లోలం, అయినా లాక్‌డౌన్ విధించే ప్రసక్తే లేదని తెలిపిన ప్రభుత్వం, తాజాగా 1,321 కరోనా కేసులు నమోదు, ఐదుగురు మృతితో 1,717కు చేరుకున్న మొత్తం మరణాల సంఖ్య

నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో 85 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. 20 రోజుల్లో 865 మందికి కరోనా వైరస్ సోకడంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ప్రభుత్వ క్వారన్‌టైన్ ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.